తల్లికి వందనం పథకంపై వైసీపీ నేతలు చేస్తున్న ఆరోపణలను ఖండించారు మంత్రి నారా లోకేష్. ఈ పథకం ద్వారా 13వేలు ఇస్తూ, 2వేలు తన అకౌంట్ లో జమ అయినట్లు ఆధారాలు ఉంటే చూపించాలని వైసీపీకి సవాల్ విసిరారు.
24 గంటల సమయం ఇస్తున్నా… నా ఖాతాలో 2వేలు పడినట్టు నిరూపించాలి లేదంటే , ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు లోకేష్. అలా చేయకుంటే న్యాయపోరాటం చేస్తానని హెచ్చరించారు. గతంలోలాగా అసత్య ఆరోపణలపై మౌనంగా ఉండే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు.
ఏపీ మోడల్ ఎడ్యుకేషన్ అంటే ఏమిటో ఏడాదిలో చూపిస్తామన్నారు లోకేష్. ప్రభుత్వ పాఠశాలలో నాణ్యత పెంచాలనేది కూటమి ప్రభుత్వ లక్ష్యం. 9 , 600స్కూల్స్ లో వన్ క్లాస్ – వన్ టీచర్ మోడల్ తీసుకొచ్చాం. ప్రభుత్వ పాఠశాలలకు తప్పనిసరిగా అన్ని చోట్ల ఉచిత కరెంట్ అందిస్తాం. సోమవారం నాటికీ ఉపాధ్యాయుల బదిలీలు పూర్తి చేస్తాం అన్నారు లోకేష్.
ఎంతమంది పిల్లలు అంటే అంతమందికి తల్లికి వందనం ఇస్తాం. కొందరి అకౌంట్ లు యాక్టివ్ కాలేదు. అందుకే డబ్బులు రిటర్న్ అయ్యాయి. తిరిగి ఖాతాలు యాక్టివ్ చేసుకోవాలన్న లోకేష్… అకౌంట్ లు యాక్టివ్ కాగానే తల్లికి వందనం నగదు జమ అవుతుందని చెప్పారు. అయితే, అంగన్ వాడీ పిల్లలకు తల్లికి వందనం వర్తించదు అని క్లారిటీ ఇచ్చారు. సన్నబియ్యంతో మధ్యాహ్న భోజనం ఇవ్వాలని నిర్ణయించామన్నారు.