రాజకీయాల్లో విలక్ష నేతగా నారా లోకేష్ కనిపిస్తున్నారు. ఎవరైనా అధికారంలో ఉన్నప్పుడు సమస్యలను ఎత్తి చూపేవారిని శత్రువులుగా చూస్తారు. వైసీపీ హాయంలో సమస్యలు చెప్పిన వాళ్లపై టీడీపీ ముద్ర వేసి వేధించారు. కానీఇక్కడ లోకేష్ భిన్నమైన మార్పు చూపిస్తున్నారు. సమస్యలను ప్రస్తావించడాన్ని ఓ సానుకూల విషయంగా చూసి వాటిని పరిష్కరించడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ కోణంలో మన్యంలో సమస్యలపై జాతీయ మీడియా కథనాలు వచ్చినా.. గుంటూరులో డ్రైనేజీ సమస్య గురించి ఓ మహిళ చెప్పినా… ఉద్దేశపూర్వకంగా చేశారని తెలిసినా.. మధ్యాహ్నభోజనం అంశంపై ఓ వీడియోలో విద్యార్థుల ఆగ్రహం గురించి తెలిసినా..ఆయన చాలా పాజిటివ్ గా స్పందించారు. సమస్యల పరిష్కారం కోసం అప్పటికప్పుడు చర్యలు తీసుకున్నారు.
పాలకపక్ష దృక్పధాన్ని మార్చేస్తున్న లోకేష్
సాధారణంగా అధికారంలో ఉన్నవారు తమ వైఫల్యాలను ఎత్తిచూపే వారిని రాజకీయ శత్రువులుగా చూస్తుంటారు. కానీ, ఇప్పుడు నారా లోకేష్ ఆ ధోరణిని పూర్తిగా మార్చేస్తున్నారు. తన వద్దకు వచ్చే విమర్శలను, సోషల్ మీడియాలో వచ్చే ఫిర్యాదులను ఆయన ఒక ఫీడ్బ్యాక్ గా స్వీకరిస్తున్నారు. సమస్య ఎక్కడ ఉన్నా, అది ఎవరు చెప్పినా.. దాని వెనుక రాజకీయం ఉందా లేదా అని చూడకుండా పరిష్కారం వైపే అడుగులు వేస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లా దేవునిచెరువు పాఠశాలలో మధ్యాహ్న భోజనం నాణ్యత సరిగ్గా లేదని విద్యార్థులు ఆహారాన్ని చెత్తబుట్టలో పోస్తున్న వీడియో వైరల్ అయ్యింది. దీనిపై లోకేష్ స్పందించిన తీరు అందరినీ ఆశ్చర్యపరిచింది. సాధారణంగా ఇలాంటి ఘటనలు జరిగితే సమర్థించుకోవడానికి ప్రయత్నిస్తారు, కానీ లోకేష్ మాత్రం నిస్సంకోచంగా క్షమాపణలు చెప్పారు. నా బిడ్డలకు నాణ్యమైన ఆహారం అందకపోవడం నా బాధ్యతారాహిత్యం అని పేర్కొంటూ వెంటనే సంబంధిత ఏజెన్సీని తొలగించి, హెడ్ మాస్టర్ను సస్పెండ్ చేయించారు. ఒక మంత్రి స్థాయి వ్యక్తి బహిరంగంగా క్షమాపణలు చెప్పడం రాజకీయాల్లో అత్యంత అరుదైన విషయం.
మన్యం నుంచి గుంటూరు దాకా
జాతీయ మీడియాలో మన్యం ప్రాంత సమస్యల గురించి కథనాలు వచ్చినా, గుంటూరులో ఒక మహిళ తన దుకాణం ముందు డ్రైనేజీ సమస్య గురించి నిలదీసినా లోకేష్ ఏనాడూ సహనం కోల్పోలేదు. అది ఉద్దేశపూర్వకంగా చేసిన రాజకీయం అని అనిపించినా.. ఆయన మాత్రం చెప్పిన సమస్యలోని వాస్తవాన్ని గమనించి అప్పటికప్పుడే అధికారులతో మాట్లాడి పరిష్కరిస్తున్నారు. మారుమూల గిరిజన ప్రాంతాల్లో రోడ్ల సౌకర్యం గురించి వచ్చిన కథనాలపై కూడా ఆయన సానుకూలంగా స్పందించి తక్షణ చర్యలు తీసుకోవడం ఆయన కార్యదక్షతకు నిదర్శనం.
నాగబాబు ప్రశంసలు
లోకేష్ అనుసరిస్తున్న ఈ సరికొత్త పంథాను జనసేన నాయకుడు, ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు కూడా మనస్ఫూర్తిగా ప్రశంసించారు. విమర్శలను స్వీకరించి, వాటిని పరిష్కరించే విషయంలో లోకేష్ చూపిస్తున్న పరిణతి రాజకీయాల్లో గొప్ప మార్పుకు సంకేతమని ఆయన పేర్కొన్నారు. నారా లోకేష్ ప్రదర్శిస్తున్న పాజిటివ్ యాటిట్యూడ్ ఏపీ రాజకీయాల్లో ఒక సరికొత్త సంస్కృతికి నాంది పలుకుతోంది. విమర్శించే వారు కూడా లోకేష్ స్పందన చూసి ఆయన అభిమానులుగా మారుతున్న పరిస్థితి కనిపిస్తోంది. సమస్యలను దాచిపెట్టడం కంటే, వాటిని అంగీకరించి సరిదిద్దడమే నిజమైన నాయకత్వ లక్షణమని లోకేష్ తన పనితీరుతో నిరూపిస్తున్నారు.


