2019 ఎన్నికలకు ముందు ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారం కోసం వచ్చినప్పుడు నారా లోకేష్ ను వారసుడిగా ఎద్దేవా చేశారు. సమర్థత లేకపోయినా ప్రజలపై రుద్దేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారన్న భావనలో ఆయన ఉండేవారు. సమర్థత లేకుండా రాజకీయ వారసత్వం అందించడానికి బీజేపీ పూర్తి విరుద్ధం. అందుకే మోదీ అలాంటి వ్యాఖ్యలు చేసేవారు. అయితే ఇప్పుడు అదే ప్రధాని మోదీ నారా లోకేష్ ను సందర్భం ఉన్న చోటల్లా ప్రశంసిస్తున్నారు. ఆయన సమర్థతను ప్రశంసిస్తున్నారు. ఇది నారా లోకేష్ కష్టపడి సాధించిన విజయం అనుకోవచ్చు.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ ని మెప్పించడం అంత తేలిక కాదు. ఎందుకంటే ఆయన ప్రధానిగా పదకొండేళ్లు ఉన్నారు. ఎవరు పనితీరు ఏమిటో ఆయనకు బాగా తెలుసు. అలాంటి ప్రధాని విశాఖలో యోగా దినోత్సవం నిర్వహించిన విధానాన్ని చూసి అబ్బురపడ్డారు. నారా లోకేష్ ను ప్రత్యేకంగా అభినందించారు. ప్రధాని మోదీ బహిరంగంగా అలా చెప్పాలంటే..యోగాంధ్ర ఎంత సక్సెస్ అయిందో చెప్పాల్సిన పని ఉండదు. నారా లోకేష్ కు ఈ ఈవెంట్ కోసం ఎంత కష్టపడ్డారో.. దానికి తగ్గ గుర్తింపు లభించిందని అనుకోవచ్చు.
ఒకప్పుడు నారా లోకేష్ పై వ్యతిరేకత భావనతో ఉండే ప్రధాని మోదీ ఒక్క సారిగా ఇలా పాజిటివ్ గా మారిపోవడం చాలా మందిని ఆశ్చర్య పరుస్తోంది. ఎంతగా అంటే.. ప్రధాని ఉండే అత్యంత బిజీ పరిస్థితుల్లో కూడా నారా లోకేష్ కుటుంబానికి .. అపాయింట్ మెంట్ ఇచ్చి.. గంటన్నర సేపు వివిధ అంశాలపై మాట్లాడారు. నారా లోకేష్ కుమారుడితో సరదాగా గడిపారు. అంటే కుటుంబసభ్యుడిగా చూసుకున్నారన్నమాట.
నారా లోకేష్ స్టాన్ ఫర్డ్ లో చదువుకున్నారు. రాజకీయాల్ని క్లీన్ గా చేయాలనుకున్నారు. అదే ఆయన పై సాఫ్ట్ ముద్ర వేసింది. ఆయన సమర్థతను ప్రశ్నించేలా చేసింది. కానీ చాలా వేగంగా నారా లోకేష్ తన రాజకీయాల్లో చేస్తున్న తప్పులేమిటో గుర్తించారు. అంతే త్వరగా మారిపోయారు. ఇప్పుడు నారా లోకేష్ మాస్ లీడర్. సమర్థమైన నేత. జాతీయ రాజకీయాల్ని సమన్వయం చేస్తున్న నేత. లోకేష్ ట్రాన్స్ ఫర్మేషన్ నరేంద్రమోదీనే మెప్పించిందంటే.. ఇక ఆయన భవిష్యత్కు తిరుగులేదని సులువుగానే అర్థం చేసుకోవచ్చు.