పహల్గంలో ఉగ్రదాడికి ప్రేరేపించడమే కాకుండా భారత్ తీవ్రంగా స్పందిస్తే అణుబాంబును ప్రయోగిస్తామని పాక్ ప్రకటన భారత్ ను తీవ్ర ఆగ్రహానికి గురి చేసినట్టుగా ఉంది. దాయాది దేశంపై దాడి మాత్రమే చేయలేదు కానీ, దౌత్యపరమైన వ్యవహారాల్లో కీలక నిర్ణయాలు తీసుకుంటూ పాక్ కు భారత్ స్ట్రోక్ ల మీద స్ట్రోక్ లు ఇస్తోంది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ కు కేంద్రం మరో బిగ్ షాక్ ఇచ్చింది.
పాక్ కు పోస్టల్ సర్వీసులను నిలిపివేస్తూ ఆదేశాలు జారీ చేసింది. పార్సిల్స్ , మెయిల్స్ పై నిషేధం విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పాక్ కు చెందిన వెబ్ సైట్లను కూడా బ్యాన్ చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. అంతేకాదు పాకిస్తాన్ కు భారత ప్రధాని మోడీ మరోసారి తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. అంగోలా అధ్యక్షుడు జోవో మాన్యుయెల్ గొన్ కాల్వ్స్ లౌరెంకాతో కలిసి ప్రధాని మీడియాతో మాట్లాడుతూ.. పహల్గంలో ఉగ్రదాడికి పాల్పడిన వారిని , ఉగ్రవాదులకు మద్దతు ఇచ్చిన వారిని వదలమని పరోక్షంగా పాక్ కు హెచ్చరికలు పంపారు.
పహల్గం ఉగ్రదాడిలో పాక్ హస్తం ఉందన్న మోడీ…దాడికి పాల్పడిన వారిలో ఒకరు పాక్ ఆర్మీలో పారా కమాండోగా పని చేసినట్లు వెల్లడి అయిందని చెప్పారు. అమాయక భారతీయ పౌరుల ప్రాణాలను బలిగొన్న వారిని వదలమని హెచ్చరించారు. ఇప్పటికే పాక్ – భారత్ మధ్య యుద్ద మేఘాలు కమ్ముకుంటున్న వేళ దాయాది దేశాన్ని ఉద్దేశించి ప్రధాని ఈ కామెంట్స్ చేయడం హాట్ టాపిక్ గా మారింది.