నక్సలిజం అంటే ఏమిటి ?. నక్సలిజం అనేది ఓ సిద్ధాంతం. సామాజిక, ఆర్థిక అసమానతలను తొలగించడం, పేదలు , అణగారిన వర్గాల హక్కుల కోసం పోరాటం చేయడం ప్రధాన లక్షణం. అయితే దీన్ని సాధించడానికి నక్సలైట్లు ఎంచుకున్న మార్గం సాయుధ పోరాటం. తుపాకీగొట్టంతో రాజ్యాధికారాన్ని సాధించి ఆ గొట్టంతోనే ప్రజల్ని భయపెట్టి పాలన చేసి.. సామాజిక, ఆర్థిక అసమానతలను తొలగించడం, పేదలు , అణగారిన వర్గాల హక్కులను కాపాడటం వంటివి చేద్దామని అనుకుంటారు. కానీ భారత్ వంటి అతి పెద్ద ప్రజాస్వామిక దేశంలో ఇది సాధ్యమేనా అని పది నిమిషాలు బూర్జువా ఆలోచనలు పక్కన పెట్టి చర్చిస్తే ఆ నక్సలైట్లకూ క్లారిటీ వస్తుంది. కానీ ఎందుకు వారు మారడం లేదు.
నక్సలిజం జన జీవన స్రవంతిలోకి రావాలి !
నక్సలిజం అంటే.. విప్లవం. ప్రజల్లో చైతన్యం వచ్చినప్పుడే ఈ నక్సలిజం ఉన్నట్లు. ప్రతి ఒక్కరిలోనూ నక్సలిజం భావనలు ఉంటాయి. అన్యాయాలపై ఎలుగెత్తేవాడు ప్రతి ఒక్కడు నక్సలైటే. అడవుల్లో ఆయధాలు చేత పట్టుకుని ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని వర్గ శత్రువుగా ప్రకటించుకుని …బలగాల్ని శత్రు సైన్యంగా భావించి చంపేయడం నక్సలిజం కాదు. వారి సిద్ధాంతాలకు ఈ హత్యలు ఎంత మాత్రం ఉపయోగపడవు. దురదృష్టవశాత్తు వారు ఇప్పటి వరకూ అదే పని చేశారు. ఇప్పుడు అలాగే నెలకొరిగిపోతున్నారు. తాము ఎవరి కోసమైతే పోరాడామని చెబుతున్నారో వారెవరూ సానుభూతి చూపించడం లేదు.
కుటుంబాలను వదిలేసి పోరాడారు – కానీ అర్థం ఏముంది ?
నక్సలైట్లు .. నక్సలిజం సిద్ధాంతాన్ని నమ్మారు. కానీ చంపడం, చచ్చిపోవడం అనే సిద్ధాంతం నక్సలిజంలో లేదు. నక్సల్స్ నాయకుల విపరీత బుద్ది వల్లనే వచ్చింది. చంపి తప్పించుకోవచ్చని రెచ్చిపోయారు. గిరిజన ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావును చంపాల్సిన అవసరం ఏమొచ్చింది?. సివేరి సోమ ఏం అన్యాయం చేశారు ?. ఇలా చెప్పుకుంటూ పోతే నక్సల్స్ మీద చాలా కోపం వస్తుంది ఎవరికైనా. కానీ వారు ఇదంతా ఎందుకు చేస్తున్నారో కానీ.. ప్రజల కోసం పోరాడుతున్నారన్న ఓ సానుభూతి ఓ మూలగా ఉంటుంది. అన్నీ వదులుకుని అడవుల బాట పట్టారు. కానీ ఇప్పుడు దాని వల్ల ప్రయోజనం ఏముంది ?. లొంగిపోకపోతే ప్రాణాలు కోల్పోవడం తప్ప.
ఇప్పటికైనా ప్రజాస్వామ్యాన్ని అంగీకరించి జనజీవన స్రవంతిలోకి కలవాలి !
నక్సలైట్లలోకి ఇప్పుడు రిక్రూట్ మెంట్లు లేవు. గతంలో ఉన్న అరకొర కూడా ఇప్పుడు ఆగిపోయాయి. గిరిజనుల్ని భయపెట్టి మావోయిస్టుల్లో చేర్చుకుంటున్నారు. కానీ మనస్ఫూర్తిగా చేరడం లేదు. ప్రజాస్వామ్యాన్ని అందరూ అంగీకరిస్తున్నారు. మిగిలిన ఉన్న నక్సలైట్లు కూడా తుపాకీ గొట్టం ద్వారా కాదు.. ప్రజాస్వామ్యం ద్వారానే సాధిస్తామని చెప్పి లొంగిపోవాలి. ప్రజలను మెప్పించి.. . నక్సలిజానికి బ్యాలెట్ ద్వారా మద్దతు సంపాదించుకోవాలి. అప్పుడే అసలైన నక్సల్ స్ఫూర్తి ఉంటుంది. ఇదంతా బూర్జువా అనుకుంటే.. ఆ అడవులకే బలి కావాల్సి ఉంటంది. అయ్యో పాపం అనేవారు కూడా ఉండరు.