తెలుగు రాష్ట్రాలకు బీజేపీ అధ్యక్షుల్ని ఖరారు చేసే సమయం ఆసన్నమయింది. జూలై ఒకటో తేదీన ఎన్నిక జరుగుతుంది. ఎన్నికల అధికారిగా లక్ష్మణను హైకమాండ్ నిర్ణయించింది. అయితే ఇదంతా ప్రాసెస్ మాత్రమే. ఇప్పటికే పార్టీ హైకమాండ్ అధ్యక్షుల్ని ఖరారు చేసింది. కానీ అధికారికంగా ఎవరికీ చెప్పలేదు. సోమ లేదా ఒకటో తేదీనే వారికి సమాచారం ఇచ్చి నామినేషన్ దాఖలు చేయమని సూచించనున్నారు. వారు తప్ప ఇతరులు నామినేషన్ వేసే అవకాశాలు లేవు.
తెలంగాణ అధ్యక్ష పదవికి ఎవరిని ఎంపిక చేస్తారన్నదానిపై ఇంకా ఎలాంటి సూచనలు బయటకు రాలేదు. ఈటల రాజేందర్ చాలా ఆశలు పెట్టుకున్నారు. అయితే ఆయనను వ్యతిరేకించే బలమైన వర్గం ఉంది. బండి సంజయ్ పేరు కూడా తెరపైకి వచ్చింది. అలాగే పలువురు సీనియర్ నేతలు కూడా ప్రయత్నించారు. ఎవరి ప్రయత్నాలు సక్సెస్ అయ్యాయో పెద్దలకే తెలియాలి.
ఇక ఏపీ బీజేపీ అధ్యక్ష పదవిపై పెద్దగా ఎవరికీ ఆసక్తిలేదు కానీ.. బీజేపీలో అంతర్గతంగా మాత్రం కాస్త పోటీ ఉంది. ప్రస్తుతం పురందేశ్వరి ఉన్నారు. ఆమెను కొనసాగిస్తారన్న ప్రచారం జరుగుతోంది. అయితే రాయలసీమ రెడ్డి వర్గానికి అవకాశం ఇవ్వాలన్న బలమైన లాబీయింగ్ కూడా జరిగింది. ఈ విషయంలో హైకమాండ్ ఎలాంటి ఆలోచన చేస్తుందో జూలై ఒకటిన తెలుస్తుంది. అధికారంలో ఉన్న కూటమిలో కీలకమైన పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడు అంటే .. మంచి పవర్ ఫుల్లే. అందుకే చాలా మంది బీజేపీ నేతలు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. ఎవరికి అవకాశం దక్కుతుందో జూలై ఒకటిన తేలుతుంది..