జగన్ కోటరీలో కీలక వ్యక్తిగా చెలామణి అవుతున్న చెవిరెడ్డి బాస్కర్ రెడ్డికి నోటీసులు జారీ అయ్యాయి. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆయన తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ చైర్మన్ గా పని చేశారు. కాంగ్రెస్ హయాం నుంచి ఆయన వైఎస్ కుటుంబీకులు ఎవరు అధికారంలోకి వచ్చినా తుడా చైర్మన్ పదవి ఆయనే తీసుకుంటారు. దీనికి కారణం ఎక్స్ ఆఫీషియో హోదాలోల టీటీడీ బోర్డులోనూ ఆయన సభ్యుడిగా ఉంటారు. ఇక చేయాల్సిన అక్రమాలకు కొదవ ఉండదు.
తుడా చైర్మన్ గా ఆ సంస్థ ఆదాయాన్ని సొంత అవసరాలకు విచ్చలవిడిగా వాడుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. తన సొంత గ్రామంలో పనులు చేయించడానికి , వ్యక్తిగత పనులు, ప్రయాణాలకు కూడా తుడా నిధుల్ని వాడినట్లుగా లెక్కలు బయటకు వచ్చాయి. మొత్తం నిధుల్లో 90 శాతం చంద్రగిరిలో పనులు చేయించడానికే వాడుకున్నారు. అవి కూడా వ్యక్తిగతంగా చేయించినట్లుగా పేర్లు వేయించుకున్నారు.
ఇంకా విచిత్రం ఏమింటటే ఏ మాత్రం సిగ్గుపడకుండా.. దొరికిపోతామన్న భయం లేకుండా.. ఆ పనులన్నీ తన కంపెనీ పేరు మీదనే చేసేశారు. డబ్బులన్నీ తన కంపెనీ ఖాతాలోనే జమ చేసుకున్నారు. అన్నింటిపై ఫిర్యాదులు రావడంతో విజిలెన్స్ విచారణ చేపట్టింది. సమాధానాలివ్వాలని నోటీసులు పంపింది. చెవిరెడ్డి ఇచ్చే వివరణ ఆధారంగా ఆయనపై చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి.