హైదరాబాద్లోని నెక్లెస్ రోడ్లోని ఎన్టీఆర్ ఘాట్ పునరుద్ధరణ పనులు జోరుగా సాగుతున్నాయి. రాష్ట్ర విభజన తర్వాత ఘాట్ ను నిర్లక్ష్యం చేయడం ప్రారంభించారు. ఈ ఎన్టీఆర్ ఘాట్ ప్రముఖ పర్యాటక కేంద్రంగా ఉంది. ఎన్టీఆర్ గార్డెన్స్ వల్ల.. హెచ్ఎండీఏకు పెద్ద ఎత్తున ఆదాయం వస్తుంది. అయినా రాజకీయ కారణాలు.. ఇతర కారణాల వల్ల నిర్వహణను పట్టించుకోవడంలేదన్న ఆరోపణలు వచ్చాయి.
ఎన్టీఆర్ జయంతి, వర్థంతులకు కూడా ముస్తాబు చేయడం మానేశారు. దీంతో ఎన్టీఆర్ ట్రస్ట్ ఈ ఘాట్ నిర్వహణ చూసుకునేందుకు ముందుకు వచ్చింది. ఇటీవల నారా లోకేష్ ఈ అంశంపై హెచ్ఎండీఏ ప్రతినిధులను సంప్రదించినట్లుగా తెలుస్తోంది. ఘాట్ మొత్తాన్ని రెనోవేట్ చేస్తామని .. సొంత నిధులతో చేస్తామని సమాచారం ఇచ్చారు. ఎన్టీఆర్ ట్రస్ట్ తరపున నిర్వహణ కూడా చూస్తామని చెప్పినట్లుగా తెలుస్తోంది.
అయితే అలా చేయడానికి అవకాశం కల్పిస్తే తమకు చెడ్డపేరు వస్తుందని.. హెచ్ఎండీఏనే రంగంలోకి దిగింది. కోటిన్నర పెట్టి ఘాట్ను సుందరీకరించే ప్రయత్నాలు ప్రారభించింది. పనులు కూడా ప్రారంభమయ్యాయి. దీంతో ఎన్డీఆర్ ఘాట్ ను చూసేందుకు రోజూ వచ్చే వందల మందికి అన్నగారి ఘాట్ .. మరింత సుందరంగా కనిపించనుంది.