ఇల్లు కట్టుకోవాలనుకునేవారికి అత్యంత క్లిష్టంగా అనిపించే ప్లాన్ అప్రూవల్ ప్రక్రియను ప్రభుత్వం సులభతరం చేసింది. భవన నిర్మాణాలకు సంబంధించి ప్రభుత్వం నూతన మార్గదర్శకాలను విడుదల చేసింది. సెల్ఫ్ సర్టిఫికేషన్ స్కీమ్ కింద ఇకపై రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పట్టణ ప్రాంత స్థానిక సంస్థలే అనుమతులు ఇవ్వనున్నాయి. ఒక్క సీఆర్డీఏ ప్రాంతానికి మాత్రమే మినహాయింపు ఉంటుంది. మిగతా అన్ని ప్రాంతాల్లో అనుమతులు జారీ చేసే అధికారాన్ని అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీల పరిధి నుంచి పట్టణ ప్రాంత స్థానిక సంస్థలకు ప్రభుత్వం బదిలీ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.
300 చదరపు మీటర్లు మించని నిర్మాణాలకు స్వయంగా యజమానులే ప్లాన్ ధ్రువీకరించి దరఖాస్తు చేసుకోవచ్చు. అర్కిటెక్టులు, ఇంజినీర్లు, టౌన్ ప్లానర్లు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. లైసెన్స్డ్ టెక్నికల్ పర్సన్లు కూడా ఇంటి ప్లాన్ను ధ్రువీకరించి అప్ లోడ్ చేసే అవకాశం ఉంది. నివాస భవనాలకు మాత్రమే ప్రభుత్వం ఈ అవకాశం కల్పించింది. ఈ మేరకు పోర్టల్లో ప్లాన్ అప్లోడ్ చేసేందుకు నిబంధనలను సరళతరం చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. అయితే ఈ అవకాశాన్ని దుర్వినియోగం చేస్తే మాత్రం కఠిన చర్యలు తీసుకుంటారు.
ఆన్లైన్ బిల్డింగ్ పర్మిషన్ సిస్టంలో ఉల్లంఘనలు జరిగితే.. సదరు భవనాల యజమానులపై చర్యలు తీసుకుంటారు. అలాగే నిర్మాణాలు చేయాలంటే అనుమతులున్న లేఅవుట్లలో నిర్మించే భవనాలకు మాత్రమే ఈ వెసలుబాట్లు కల్పించారు. అలాగే కోస్టల్ రెగ్యులేటరీ జోన్లో నిర్మించే భవనాలకు ఈ సెల్ఫ్ సర్టిఫికేషన్ స్కీమ్ అందుబాటులోఉండదు. వైసీపీ హయంలో పీకేసిన రియల్ ఎస్టేట్ రంగాన్ని మరింతగా ప్రోత్సహించేందుకు ఈ చర్యలు చేపట్టినట్లుగా ప్రభుత్వం ప్రకటించింది. ప్రభుత్వం పరమైన వ్యవహారాల్లో ఎలాంటి ఆలస్యం ఉండకూడదని.. భావిస్తోంది. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో భాగంగా ఈ సంస్కరణలు చేపట్టారు. ఈ ఉత్తర్వులతో ఏపీలో నిర్మాణ కార్యకలాపాలు ఊపందుకునే అవకాశం ఉంది.