ఓటీటీలు సినిమా రిలీజ్ డేట్ని డిసైడ్ చేస్తున్నాయన్నది కొన్నాళ్లుగా జరుగుతున్న చర్చ. “అదేం లేదు.. మా సినిమా మా చేతుల్లో ఉంది. మాకు నచ్చిన టైమ్లో రిలీజ్ చేసుకుంటాం” అని మాట్లాడిన నిర్మాతలు కూడా ఉన్నారు. కానీ వాస్తవం ఏమిటంటే… రిలీజ్ టైమ్ని లాక్ చేస్తోంది ఆ సినిమాలను కొనే ఓటీటీ సంస్థలే. ఈ విషయాన్ని స్వయంగా హీరో నాగార్జున చెప్పారు.
“రిలీజ్ టైమ్ ని ఓటీటీ సంస్థలే చెబుతాయి. వాళ్ల స్లాట్ ప్రకారం ఓ టైమ్ అనుకుంటారు. ‘కుబేర’కి కూడా జూన్లో వచ్చేయాలని చెప్పారు. తప్పదు. అది వాళ్ల బిజినెస్ మోడల్” అని కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు నాగార్జున.
సినిమా ఇండస్ట్రీకి, థియేటర్ బిజినెస్కు ఇది చాలా కీలక మార్పుగా చూడాలి. మొదట నిర్మాతలకు లాభాలు చూపించిన ఓటీటీలు ఇప్పుడు ఎక్కడ లేని నిబంధనలు మొదలుపెట్టాయి. ఈ రోజు రిలీజ్ డేట్ను డిసైడ్ చేస్తున్న ఓటీటీలు… రేపు కంటెంట్పై ఆంక్షలు పెట్టడం మొదలుపెడితే పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది.
బాలీవుడ్లో వివేక్ అగ్నిహోత్రి లాంటి ఫిల్మ్ మేకర్లు ఓటీటీల తీరుపై ఇప్పటికే తీవ్ర విమర్శలు చేశారు. తన ‘కాశ్మీర్ ఫైల్స్’ కంటెంట్లో చాలా అభ్యంతరాలు తెలిపారని, వాస్తవాల్ని కూడా కల్పితాలుగా చిత్రీకరించమన్నారని గతంలో చెప్పారు వివేక్. ఇదే కాదు… రిలీజ్ డేట్ ఓటీటీల చేతికి వెళ్లినట్లు కంటెంట్ కూడా వెళ్లితే, ఒరిజినల్ ఫిల్మ్ మేకర్స్కు చాలా ఇబ్బంది.
కేవలం డబ్బే పరమావధిగా నడిస్తే మాత్రం సినీ కళకు చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఓటీటీ చేతుల్లోకి వచ్చిన రిలీజ్ డేట్ ట్రెండ్ మంచిది కాదు. దీని వలన వాళ్ళు ఆడించేదే ఆట అవుతుంది. థియేటర్లు ఇంకా కష్టాల్లో పడతాయి. ఈ ట్రెండ్ లాంగ్ రన్లో థియేటర్లను ఇంకా కష్టాల్లో పడేసే ప్రమాదం ఉంది.
“మేము చెప్పిన టైమ్లో సినిమా రిలీజ్ చేస్తే ఓ కోటి రూపాయలు ఎక్కువ ఇస్తాం” అంటూ ఓటీటీలు ఊరిస్తే, నిర్మాతలు ఓ మెట్టు తగ్గడం సహజమే. కానీ ఈ తగ్గడం మొత్తం సినిమా బిజినెస్ను, ఒక వ్యవస్థను, కళనే నాశనం చేసేలా ఉంటే మాత్రం… అది ఎవరికీ మంచిది కాదు. ఈ విషయంలో స్వల్పకాలిక ప్రయోజనాలు కాకుండా, దీర్ఘకాలిక దృష్టితో ఇండస్ట్రీ ముందుకు కదలాల్సిన అవసరం ఉంది.