కథని కాపాడుకోవడం ప్రతి దర్శక-రచయితకి ఓ పెద్ద సవాల్. ఒక సంస్థలో కథ చెప్పే ముందు రిజిస్టర్ చేసుకున్నప్పటికీ, ఆ కథ సేఫ్ అనే గ్యారంటీ లేదు. పాయింట్లో కొత్తదనం ఉంటే, దానికి కొత్త మసాలా యాడ్ చేసి వేరే కథ వండేయడం సర్వసాధారణం. ఇప్పుడు ఈటీవీ విన్ ఓటీటీకి వచ్చిన సమస్య మాత్రం కొంచెం వెరైటీగా ఉంది.
ఇటీవలే ‘విరాటపాలెం’ వెబ్ సిరీస్ ట్రైలర్ని జీ5 విడుదల చేసింది. ఈ ట్రైలర్ చూసిన ఈటీవీ విన్కు షాక్ తగిలింది. విరాటపాలెం ట్రైలర్లోని కథ, ఈటీవీ విన్ తీస్తున్న ‘కానిస్టేబుల్ కనకం’ కథ ఒక్కటే. ఈ సినిమా దర్శకుడు ప్రశాంత్ రెండు సంవత్సరాల క్రితం జీ5తో ట్రావెల్ అయ్యాడు. కథపై వర్క్ చేయించారు. ఎందుకో మధ్యలో ఆపేశారు. తర్వాత ప్రశాంత్ ఈటీవీ విన్కి అదే ప్రాజెక్ట్ను తీసుకెళ్లారు. అయితే ఈ గ్యాప్లో సైలెంట్గా జీ5, ప్రశాంత్ రాసుకున్న కథతోనే విరాటపాలెం తీసిందని ఈటీవీ విన్ ఆరోపిస్తోంది.
‘కానిస్టేబుల్ కనకం’ ఈటీవీ విన్ ఒరిజినల్ సిరీస్. సినిమా వచ్చిన తర్వాత చేసేది పైరసీ. అసలు రాకముందే ఇలా చేసేవారిని ఏమనాలో అర్థం కావడం లేదు. అదే స్టోరీ, స్క్రీన్ప్లే, క్యారెక్టర్స్ కాపీ కొట్టి తీశారంటే ఏమనాలి? ఈ కథను 2022లో రిజిస్టర్ చేసాము. ‘కానిస్టేబుల్ కనకం’ సీజన్ 1, సీజన్ 2 ని ఈటీవీలో చాలా ప్రెస్టీజియస్గా రూపొందిస్తున్నాం. కానిస్టేబుల్ కనకం మా ఒరిజినల్ కథ. ఇలాంటివి చేయడం చాలా తప్పు. దీనిపై న్యాయపోరాటం చేస్తాం. దీనికోసం ఎంతవరకైనా వెళ్తాం’ అని ఈవిన్ యాజమాన్యం చెబుతోంది.
జీ5 నేషనల్వైడ్గా పెద్ద సంస్థ. ఈవిన్ కూడా బలమైన సంస్థే. సుప్రీం కోర్ట్ వరకూ వెళ్లి పోరాడే సత్తా ఉన్న సంస్థ. కాకపోతే ఈ 27 మే విరాటపాలెం రిలీజ్ అయిపోతుంది. మరి ఇంత తక్కువ సమయంలో ఓటీటీ రిలీజ్ని నియంత్రించడం ఎలా సాధ్యమవుతుందో చూడాలి.