సైబర్ ఎటాక్స్ ఎక్కడ చేస్తారు.. ?. సాంకేతిక నిపుణులు, హ్యాకర్స్ అందరూ.. కంప్యూటర్లు,ఫోన్లపై చేస్తారు. కానీ పాకిస్తాన్ యోధులు మాత్రం ఫ్లడ్ లైట్లు, డ్యాముల గేట్ల మీద చేస్తారు. నమ్మాలంటే పాకిస్తాన్ రక్షణ మంత్రి మాటల్నివినాల్సిందే. పార్లమెంట్ ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా తాము ఏం చేశామో భారత్ కు కూడా తెలియదని.. చెప్పారు. ఏం చేశారంటే.. ఐపీఎల్ మ్యాచ్ ల ఫ్లడ్ లైట్లు హ్యాక్ చేశామని.. డ్యామ్ గేట్లపై సైబర్ ఎటాక్స్ చేశామని చెప్పుకొచ్చారు. ఆయన మాటలు పాకిస్తాన్ లో ఎంతమంది నమ్ముతారో కానీ.. ప్రపంచం అంతా నవ్వుతోంది.
పాకిస్తాన్ డ్రోన్లతో దాడులు చేసినప్పుడు భారత్ కొన్ని నగరాల్లో బ్లాకౌట్ చేసింది. ధర్మస్థల వంటి చోట్ల జరగాల్సిన మ్యాచులు రద్దు అయ్యాయి. దాన్ని తాము హ్యాక్ చేసి.. ఫ్లడ్ లైట్లు ఆపేశామని రక్షణ మంత్రి చెప్పుకున్నారు. సింధూ జలాల ఒప్పందాన్ని రద్దు చేసిన తర్వాత నీరు ఎక్కువగా నిల్వ కావడంతో ఒక్క సారిగా పాక్ లోకి వరద వచ్చేలా డ్యాముల గేట్లు ఎత్తారు. దీన్ని పాక్ రక్షణ మంత్రి తాము సైబర్ ఎటాక్ చేసి ఎత్తామని చెప్పుకున్నారు. పాకిస్తాన్ ప్రజలు అమాయకంగా నమ్మేస్తారని అనుకున్నారేమో అంతర్జాతీయంగా పరువు పోయింది.
ఖవాజా అనే ఈ పాక్ రక్షణ మంత్రి యుద్ధం జరుగుతున్నప్పుడు ఓ అంతర్జాతీయ మీడియాకు ఇంటర్యూ ఇచ్చారు. ఇండియా ఫైటర్ జెట్లను కూల్చేశామని చెప్పుకున్నారు. ఆధారాలేవి అని యాంకర్ అడిగితే.. సోషల్ మీడియాలో వచ్చాయని చెప్పారు. మీరు పాకిస్తాన్ రక్షణ మంత్రి.. ఆధారాలతో మాట్లాడాలని ఆ యాంకర్ అంటే .. ఈ ఖవాజాకు నోటి మాట రాలేదు. ఇలాంటి వారు పాకిస్తాన్ ను నడుపుతూంటే ఆ దేశం దివాలా తీయక అభివృద్ధి చెందుతుందా ?