ప్రపంచ కప్ విజేతగా నిలిచిన భారత మహిళల అంధుల క్రికెట్ జట్టుకు పవన్ కల్యాణ్ అండగా నిలిచారు. మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో క్రికెటర్లు, శిక్షకులు, సహాయక సిబ్బందితో సమావేశం అయ్యారు. ప్రపంచ కప్ సాధించిన క్రికెటర్లను అభినందించారు. ఒక్కో క్రికెటర్ కీ రూ.5 లక్షల చొప్పున చెక్ ఇచ్చారు. కోచ్లకు రూ.2 లక్షలు చొప్పున చెక్కులు అందించారు. ప్రతి మహిళ క్రికెటర్ కీ పట్టు చీర, శాలువాతోపాటు జ్ఞాపిక, కొండపల్లి బొమ్మలు, అరకు కాఫీతో కూడిన బహుమతులను అందించి సత్కరించారు.
మహిళా అంధ క్రికెటర్లు సాధించిన విజయం దేశానికే గర్వకారణమని పవన్ కళ్యాణ్ ప్రశంసించారు. అంధ క్రికెటర్ల ప్రాక్టీస్ కోసం ప్రత్యేక సదుపాయాలు కల్పించాలని, అన్ని విధాలా అండగా నిలవాలని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు స్వయంగా విజ్ఞప్తి చేస్తానని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం క్రీడలను ప్రోత్సహిస్తోందని, మహిళా క్రికెటర్లు తెలిపిన అంశాలను చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకువెళ్తానని చెప్పారు. ప్రపంచ కప్ గెలిచిన జట్టులో ఉన్న ఆంధ్ర ప్రదేశ్ క్రీడాకారీణులు దీపిక , పాంగి కరుణా కుమారి ఉండటం సంతోషంగా ఉందన్నారు.
ఈ సందర్భంగా జట్టు కెప్టన్ దీపిక తమ గ్రామ సమస్యలు తెలిపారు. ఆమె శ్రీ సత్యసాయి జిల్లా హేమావత్ పంచాయతీ తంబలహట్టి తండాకు చెందినవారు. తమ గ్రామానికి రహదారి సౌకర్యం కావాలని దీపిక విజ్ఞప్తి చేశారు. ఇందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆదేశించారు. అల్లూరి సీతారామరాజు జిల్లాకి చెందిన క్రికెటర్ కరుణకుమారికి చేసిన విజ్ఞప్తులపైనా తక్షణమే చర్యలు ప్రారంభించాలని ఆదేశించారు.
