ఆపరేషన్ సింధూర్ సమయంలో లా స్టూడెంట్ శర్మిష్ఠ పనోలిని సోషల్ మీడియాలో మతతత్వ వ్యాఖ్యలు చేశారని కోల్ కతా పోలీసులు ఆమెను తాజాగా అరెస్ట్ చేయడంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. లౌకికవాదం రెండువైపులా ఉండాలన్న పవన్.. కొంతమందికి లౌకికవాదం కవచం కాదని, ఇదే సమయంలో మరికొంతమందికి కత్తి కాదన్నారు.
శర్మిష్ఠ పనోలిని అప్పట్లో చేసిన వ్యాఖ్యలు కొంతమందికి బాధ కలిగించి ఉండొచ్చు. అయితే, ఆమె తన తప్పును అంగీకరించి, వీడియోను డిలీట్ చేయడమే కాకుండా క్షమాపణలు కూడా చెప్పింది. అయినా పోలీసులు ఆమెపై చర్యలు చేపట్టారని పవన్ అసహనం వ్యక్తం చేశారు.
పశ్చిమ బెంగాల్ అధికార పార్టీకి చెందిన టీఏంసీ ఎంపీలు సనాతన ధర్మాన్ని అపహాస్యం చేసినప్పుడు, హిందువుల మనోభావాలు గాయపడినప్పుడు ఎందుకు చర్యలు చేపట్టలేదని ప్రశ్నించారు పవన్ కళ్యాణ్. అప్పుడు వారు క్షమాపణలు ఎందుకు చెప్పలేదన్నారు. దైవదూషణలను ఎప్పుడూ ఖండించాలన్న పవన్ లౌకికవాద స్ఫూర్తి ఇరువైపులా ఉండాలని సూచించారు.
పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ సైన్యం ఆపరేషన్ సిందూర్ చేపట్టిన విషయం తెలిసిందే. ఆ సమయంలో మాట్లాడనందుకు బాలీవుడ్ నటులను లక్ష్యంగా చేసుకొని శర్మిష్ఠ పనోలిని దుర్భాషలాడుతూ, మతతత్వ పదజాలాన్ని ఉపయోగించారని కోల్ కతా పోలీసులు ఆమెను శనివారం అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.