పేర్ని నాని భయపడుతున్నారు. ఫలానా కేసులో అరెస్టు చేస్తారు అని వార్తల్లో రాగానే ప్రెస్మీట్లు పెడుతున్నారు. కోర్టులకు వెళ్తున్నారు. పోలీసుల్ని బెదిరిస్తున్నారు. మంత్రి కొల్లు రవీంద్రను హెచ్చరిస్తున్నారు. కార్యకర్తల సమావేశాల పెట్టి.. మనకేం కాదు.. నన్నెవరూ ఏమీ చేయలేరు అంటున్నారు. ఆయన తీరుతో వైసీపీ నేతలు కూడా ఇంత భయపడుతున్నారేంటి అని గుసగుసలాడుకుంటున్నారు.
బియ్యం కొట్టేసిన కేసులో తన భార్య అరెస్టు కాకుండా.. వారం పది రోజుల పాటు ఒక్కో ప్రాంతానికి దొరక్కుండా తిరిగినప్పుడే మానసికంగా చచ్చిపోయానని ఆయన పెద్ద పెద్ద డైలాగులు చెబుతున్నారు. మరి అలాంటప్పుడు ఆ తప్పు అంతా తనదే అని చెప్పుకుని పోలీసులకు లొంగిపోయి ఉండాల్సింది. తన భార్యను అరెస్టు చేయించడానికి చాలా ప్రయత్నించారని కానీ చంద్రబాబు ఒప్పుకోలేదని తెలిసిందని కూడా ఆయన చెప్పుకున్నారు. ఇప్పుడు నకిలీ పట్టాలు పంపిణీ చేసిన కేసులో అరెస్టు చేస్తారని తెలియగానే పోలీసులపై ఒత్తిడి తెచ్చేందుకు రెడీ అియిపోయారు.
చాలా మంది వైసీపీ నేతలు అరెస్టు చేయాలనుకుంటే చేయండి అని సవాల్ చేస్తున్నారు. తర్వాత అరెస్టు చేస్తారనుకుంటే పరారవుతున్నారు. పిన్నెల్లి నుంచి కాకాణి గోవర్ధన్ రెడ్డి వరకూ అందరూ అంతే. పేర్ని నాని కూడా ఇవే సవాళ్లు చేస్తున్నారు కానీ.. కనిపించకుండా పోతున్నారు. జగన్ రెడ్డి తాను చాలా కాలం జైల్లో ఉన్నానని ఆయన బయటకు వచ్చి సీఎం అయ్యానని..మీరెవరైనా జైలుకు వెళ్తే గర్వంగా ఫీలవ్వాలని అంటున్నారు. కానీ పేర్ని నాని ఎందుకో భయపడుతున్నారు. తాను తప్పు చేయలేదని మాత్రం చెప్పడంలేదు. తనపై కేసులు పెడితే.. అరెస్టు చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరిస్తున్నారు.
కొల్లు రవీంద్ర 2014-19 మధ్య కూడా మంత్రిగా ఉన్నారు. ఆ సమయంలో పేర్ని నాని స్వేచ్చగా రాజకీయాలు చేసుకున్నారు. కానీ పేర్ని నాని మంత్రి అయిన తర్వాత ఉద్దేశపూర్వకంగా కొల్లు రవీంద్రను తప్పుడు హత్య కేసులో ఇరికించి జైలుకు పంపారు. దాదాపుగా నెలన్నర రోజులు జైల్లో ఉన్నారు. ఓ సౌమ్యుడిని.. పద్దతిగా రాజకీయాలు చేసే వ్యక్తిని జైలుకు పంపడంతో పేర్నినానిపై ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది. ఆయనకు ఇప్పుడు సానుభూతి కూడా రావడం లేదు. అందుకే బెదిరింపులకు దిగుతున్నారు.