ప్రకాశం జిల్లా విషయంలో ఏపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు ఆ ప్రాంత ప్రజాప్రతినిధులకు సైతం ఆవేదన కలిగిస్తోంది. అత్యధికంగా అధికార పార్టీ ప్రతినిధులే కావడంతో బహిరంగంగా ఎవరూ నోరెత్తలేకపోతున్నారు. కానీ విపక్ష పార్టీ నేతలు మాత్రం సైలెంట్గా ఉండలేకపోతున్నారు. ప్రభుత్వం వేధింపులకు పాల్పడుతుందని తెలిసినా తమ జిల్లా కోసం గొంతెత్తుతున్నారు. ప్రకాశం జిల్లాకు వెలిగొండ ప్రాజెక్ట్ కరువు తీర్చే మంత్రం లాంటిది. ఆ ప్రాజెక్టు దాదాపుగా పూర్తయింది. కొన్ని పనులు మిగిలి ఉన్నాయి. అ ప్రాజెక్టుకు నిధులు ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. దానిపై తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేస్తూ కృష్ణా బోర్డుకు లేఖ రాసింది.
వెలిగొండ ప్రాజెక్టుకు అనుమతులు లేవని.. అనుమతులు లేని ప్రాజెక్టుకు నిధులు ఇవ్వవొద్దని కోరింది. నిజానికి ఏపీ ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా అ ప్రాజెక్టును కేంద్రం నోటిఫై చేయలేదు. కృష్ణాబోర్డు గెజిట్లో ఆ ప్రాజెక్టుకు చోటు దక్కలేదు. అయితే తర్వాత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చొరవతో దాన్ని గెజిట్లో చేర్చారు. గెజిట్లో చేర్చడం.. నిధులు ఇవ్వడంపై తెలంగాణ ఫిర్యాదుల లేఖ రాసింది. కానీ ఏపీ ప్రభుత్వంలో స్పందన లేకపోవడంతో టీడీపీ ఎమ్మెల్యేలు నేరుగా తెలంగాణ సీఎం కేసీఆర్కు లేఖ రాశారు. తెలంగాణలోని కల్వకుర్తి, నెట్టెంపాడులకు ఎలా అనుమతులు ఇచ్చారో అలాగే వెలిగొండకు కూడా వచ్చాయని విభజన చట్టంలో ఆ విషయం స్పష్టంగా ఉందని గుర్తు చేశారు. కరువు జిల్లా అయిన ప్రకాశంపై వివాదాలు సృష్టించవద్దని కోరారు.
నిజానికి రాయలసీమ ఎత్తిపోతల నిర్మిస్తే అత్యధికంగా నష్టపోయేది తెలంగాణ ఏమో కానీ ఏపలోని ప్రకాశం కూడా మరింత కరువులో చిక్కుకుంటుంది. ఇదే విషయాన్ని ప్రశ్నిస్తూ ప్రకాశం ఎమ్మెల్యేలు సీఎంకు లేఖ రాశారు. అయినా సీఎం జగన్ స్పందించలేదు. ఇప్పుడు ప్రకాశం జిల్లా రైతులకు నీరందించే ప్రాజెక్టు వెలిగొండపైనా వివాద ప్రాజెక్టు ముద్ర వేసే ప్రయత్నం చేస్తూండటంపైనా వారు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.