తెలంగాణ ప్రభుత్వం స్థానిక ఎన్నికల నిర్వహణకు రంగం సిద్ధం చేసుకుంటోంది. ముందుగా పరిషత్ ఎన్నికలు నిర్వహించాలని డిసైడయింది. ఆ తర్వాత సర్పంచ్, మున్సిపల్ ఎన్నికలను నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది. వచ్చే కేబినెట్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకుంటామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. రెండు రోజుల కిందట మంత్రి సీతక్క కూడా ఇదే విషయాన్ని ప్రకటించారు.
తెలంగాణలో పరిషత్, పంచాయతీ, మున్సిపల్ అన్నింటి కాలపరిమితి ముగిసింది. ప్రస్తుతం స్పెషలాఫీసర్ల పాలనలో ఉన్నాయి. కాంగ్రెస్ క్యాడర్ కూడా స్థానిక ఎన్నికల కోసమే ఎదురు చూస్తున్నాయి. స్థానిక సంస్థలు ఎన్నికలు జరిగితే వేల మంది కాంగ్రెస్ క్యాడర్ కు పదవులు లభిస్తాయి. అధికారంలో ఉన్నారు కాబట్టి గెలుపు సులువు అవుతుందని క్యాడర్ నమ్మకంగా ఉంది.
అయితే బీసీ రిజర్వేషన్లు, పథకాల అమలు అంటూ.. వాయిదా వేసుకుంటూ ప్రభుత్వం వచ్చింది. ఇప్పుడు ఆ పథకాలు, బీసీ రిజర్వేషన్లు ఇంకా పరిష్కారం కాని సమస్యల్లాగే ఉండిపోయాయి. అవి ఎప్పటికీ అలాగే ఉంటాయని .. ఇక ఎన్నికలు నిర్వహించక తప్పదని ప్రభుత్వం అభిప్రాయానికి వచ్చింది. సోమవారం కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకుని వచ్చే నెలలో సర్పంచ్ ఎన్నికలు కూడా పూర్తి చేసేయాలని అనుకుంటారు. చివరికి మున్సిపల్ ఎన్నికలను నిర్వహించనున్నారు.