హైదరాబాద్ పోలీసులు శుక్రవారం ఓ డ్రగ్స్ రాకెట్ లో కీలక వ్యక్తుల్ని అరెస్టు చేశారు. ఒకరు ఓ యువతి..మరొకరు డ్రగ్స్ కొరియర్. పక్కా సమాచారంతో డ్రగ్స్ డెలివరీ తీసుకుంటున్నప్పుడు అరెస్టు చేశారు. ఆమె ఎవరో తెలుసుకుని పోలీసులు కూడా ఆశ్చర్యపోయారు.
హైదరాబాద్ లో ఉన్న ఓ ప్రముఖ కార్పొరేట్ ఆస్పత్రి యజమాని అయిన వైద్యుడి కుమార్తె ఆమె. ఆమె కూడా స్వయంగా డాక్టర్. కానీ చేతిలో కావాల్సినంత డబ్బు ఉండటంతో దాన్ని దురలవాట్ల కోసం ఉపయోగించడం ప్రారంభించారు. ముంబైలోని ఓ పబ్ లో పరిచయం అయిన వ్యక్తితో డ్రగ్స్ అలవాటు చేసుకుని దాన్ని వ్యసనంగా మార్చుకున్నారు. అది ఏ స్థాయికి వెళ్లిందంటే.. ఆమె ఒక్క ఏడాదిలో ఏకంగా 70 లక్షల రూపాయల విలువైన డ్రగ్స్ కొనుగోలు చేసి వాడేసింది.
పోలీసులు ఆమెను పట్టుకున్నప్పుడు ఐదు లక్షల రూపాయల విలువైన సరుకును డెలివరీ తీసుకుంటోంది. ఆమెను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. రిమాండ్ కు తరలించారు. కానీ ఆమె పరిస్థితి చూసి.. రిహాబిలిటేషన్ సెంటర్ కు తరలించాల్సి వచ్చింది. తన కూతురు దారి తప్పిందని డ్రగ్స్ కు బానిసగా మారిందని ఆ బిజీ డాక్టర్ తండ్రికి తెలుసో లేదో కానీ ఇప్పుడు మాత్రం పరువు పోయి ఉంటుంది. ఆమె పేరు పోలీసులు బయటకు చెప్పలేదు కానీ.. వాళ్ల సర్కిల్స్ లో మాత్రం అందరికీ తెలిసిపోయి ఉంటుంది.
డబ్బులు అడ్డగోలుగా సంపాదించడం కూడా పిల్లల భవిష్యత్ ను నాశనం చేయడం చేయడానికి కారణం అవుతుంది. ఇప్పుడు ఆ డాక్టర్ ఎంత ఖర్చు పెట్టినా తన కుమార్తె మామూలు స్థితికి వస్తుందా ?