పాక్ విషయంలో యూపీఏ ప్రభుత్వం ఏమి సాధించింది?

యూపీఏ ప్రభుత్వం తనకు అందుబాటులో ఉన్న అన్ని దౌత్య మార్గాల ద్వారా భారత్ పై ఉగ్రవాద దాడులను ప్రోత్సహిస్తున్న పాకిస్తాన్ని బోనులో నిర్బందిస్తే, ప్రధాని నరేంద్ర మోడి తన హోమ్, విదేశాంగ, రక్షణ మంత్రులకి కూడా తెలియనీయకుండా లాహోర్ వెళ్లి పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ టీ త్రాగి వచ్చి పాకిస్తాన్ కి విముక్తి కల్పించారని కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధి నిన్న లోక్ సభలో ఆరోపించారు. యూపీఏ ప్రభుత్వం యొక్క ఆరేళ్ళ కష్టాన్ని మోడీ ఒక్క పర్యటనతో తుడిచిపెట్టేసారని ఆరోపించారు.

రాహుల్ గాంధి వాదన వినడానికి చాలా బాగుంది కానీ యూపీఏ ప్రభుత్వం హయంలో భారత్-పాక్ సరిహద్దుల వద్ద నిత్యం జరిగిన కాల్పులు, భారత్ పై జరిగిన దాడుల మాటేమిటి? పాక్ పట్ల యూపీఏ ప్రభుత్వం అనుసరించిన లోపభూయిష్టమయిన విదేశీ విధానం వలననే, కాశ్మీర్ విషయంలో అంతర్జాతీయ వేదికలపై పాక్ అంతగా పేట్రేగిపోతూ మాట్లాడగలిగేది. భారత్ ఎప్పుడూ దానికి ఏవిధంగా సమాధానం చెప్పాలా…అని ఆలోచించేది తప్ప పాక్ ని కట్టడి చేసే వ్యూహం ఏనాడూ అమలుచేయలేకపోయింది.

అంతర్జాతీయంగా పాకిస్తాన్ని ఒంటరి చేసామని రాహుల్ గాంధి చెప్పుకోవడం కూడా చాలా హాస్యాస్పదంగా ఉంది. యూపీఏ ప్రభుత్వం హయాంలో అంతర్జాతీయ వేదికలపై భారత్ ప్రధాని, అధికారుల కంటే, పాక్ ప్రధాని, వారి అధికారులకే ఎక్కువ ప్రాధాన్యత ఉండేదనే సంగతి అందరికీ తెలుసు. అయినా అంతర్జాతీయ సమాజంలో పాక్ ని ఏకాకిని చేయడమో లేక దానితో తెగ తెంపులు చేసుకోవడం వలననో సమస్యలు పరిష్కారం కావు. పైగా అటువంటి ప్రయత్నాల వలన పాక్ ఇంకా ఉగ్రవాదం గుప్పెట్లోకి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది.

అయితే అంతర్జాతీయ వేదికలపై పాక్ కాశ్మీర్ అంశం ప్రస్తావించినప్పుడు, ఇదివరకులాగా భారత్ నీళ్ళు నమలకుండా అది ఎన్నడూ ఊహించలేని సమాధానం చెప్పి నోటమాట రాకుండా చేయగలిగింది. “ఇప్పుడు ఆలోచించవలసింది కాశ్మీర్ సమస్య కాదని, పాక్ ఆక్రమిత కాశ్మీర్ ని ఏవిధంగా దాని చెర నుండి విడిపించాలన్నదే అసలయిన సమస్య” అని భారత్ చెప్పిన సమాధానం పాకిస్తాన్ కి పెద్ద షాక్ వంటిదేనని చెప్పవచ్చును. యూపీఏ హయాంలో ఏనాడూ కూడా అంత దైర్యంగా మాట్లాడిన దాఖలాలు లేవు.

మదించిన ఏనుగుని లొంగదీసుకోవడానికి దాని పట్ల కటినంగా వ్యవహరించాల్సి ఉంటుంది. అది కొంచెం లొంగినట్లు కనపడగానే మళ్ళీ దానిని మెల్లగా మచ్చిక చేసుకోవడానికి మావటి ప్రయత్నిస్తాడు. ప్రధాని నరేంద్ర మోడి కూడా పాక్ పట్ల సరిగ్గా అదే విధంగా వ్యవహరిస్తున్నారని చెప్పవచ్చును.

మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పాక్ పట్ల కొంచెం కటినంగానే వ్యవహరిస్తుండటం అందరూ చూస్తూనే ఉన్నారు. కానీ పాక్ పట్ల తమకు విద్వేషం లేదని తెలియజేస్తూ పాక్ ప్రధానితో మంచి సంబంధాలు కూడా నెరపుతున్నారు. గత మూడు నాలుగు నెలలుగా భారత్-పాక్ సరిహద్దుల వద్ద తుపాకుల మ్రోత నిలిచిపోవడం, పఠాన్ కోట్ దాడికి పాక్ బాధ్యత తీసుకోవడం వంటివన్నీ మోడీ అనుసరిస్తున్న చక్కటి వ్యూహానికి వస్తున్న మంచి ఫలితాలే.

నిజానికి కాశ్మీర్ చిచ్చు కాంగ్రెస్ పార్టీ రగిల్చిందే. ఇన్ని దశాబ్దాలుగా దేశాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ దానిని ఆర్పలేక చేతులు ఎత్తేసింది. కానీ ప్రధాని నరేంద్ర మోడి కేవలం రెండేళ్ళ వ్యవధిలో భారత్ పట్ల పాక్ వైఖరిలో చాలా మార్పు తేగలిగారు. దౌత్యపరంగా అది చాలా గొప్ప విజయమే. అయితే యుద్దోన్మాదులయిన ఉగ్రవాదులు, సైనికాధికారులు, మత ఛాందసవాదుల గుప్పిట్లో చిక్కుకొన్న పాకిస్తాన్ మారడానికి చాలా సమయం పట్టవచ్చును కనుక రాత్రికి రాత్రే ఫలితాలు ఆశించలేము.

పాక్ ని ఏదో విధంగా దెబ్బ తీయడం వలన భారత్ కి ఒరిగేదేమీ ఉండబోదు పైగా దాని వలన ఇప్పుడు ఉన్న సమస్యలను ఇంకా పెంచుకోన్నట్లే అవుతుంది. కనుక పాక్ లో ప్రజా ప్రభుత్వం బలపడేందుకు భారత్ అన్ని విధాల సహాయసహకారాలు అందించడమే మంచి ఆలోచన. అప్పుడే భారత్ కి కూడా ఈ ఉగ్రవాదుల బెడద తప్పుతుంది. ప్రస్తుతం ప్రధాని నరేంద్ర మోడి అదే పని మీదున్నారు. కానీ దేశాన్ని ఏలాలనుకొన్న రాహుల్ గాంధి ఈమాత్రం లోతుగా కూడా ఆలోచించలేనట్లు చాలా అపరిపక్వంగా మాట్లాడుతున్నారు. ఆయన మాటలు ప్రజలను ఆకట్టుకోగలవేమో కానీ ఇరు దేశాల సమస్యలను పరిష్కరించలేవు. ఇదివరకు లోక్ సభ వెనుక బెంచీలలో కునుకు తీస్తూ కాలక్షేపం చేసిన రాహుల్ గాంధి, పార్టీ అధ్యక్ష పదవి చేపట్టాలనుకొన్నప్పుడు పార్టీలో నుండే అభ్యంతరాలు ఎదురయ్యాయి. అప్పటి నుండి చాలా ఆత్మన్యూనతతో బాధ పడుతున్నట్లున్నారు. అందుకే ఆయన తాను ప్రధాని మోడీకి ఏమాత్రం తీసిపోనని నిజానికి ఆయన కంటే తానే చాలా తెలివయిన వాడినని నిరూపించుకోవాలనే ఆరాటంతో ఈ విధంగా మాట్లాడుతున్నారని భావించవచ్చును.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

4 చోట్ల టీడీపీ అభ్యర్థుల మార్పు ?

తెలుగుదేశం పార్టీ నలుగురు అభ్యర్థులను మార్చాలని నిర్ణయించుకుంది. నరసాపురం సిట్టింగ్ ఎంపీ అయిన కనుమూరు రఘురామకృష్ణరాజు ఉండి అసెంబ్లీ నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దింపడం దాదాపు ఖాయమే. మంతెన రామరాజుకు...

విజయమ్మ బర్త్‌డే విషెష్ : షర్మిల చెప్పింది.. జగన్ చెప్పాల్సి వచ్చింది !

వైఎస్ విజయలక్ష్మి పుట్టిన రోజును వైఎస్ జగన్ గత మూడేళ్లలో ఎప్పుడూ తల్చుకోలేదు. సోషల్ మీడియాలో చిన్న పోస్టు కూడా పెట్టలేదు. కానీ ఎన్నికలు ముంచుకొస్తున్న సమయంలో జగన్ కు...

ఆసుపత్రి వ్యాపారంపై మాధవీలత సంచలన వ్యాఖ్యలు

మాధవీలత... బీజేపీ హైదరాబాద్ ఎంపీ అభ్యర్థి. ఎంఐఎంకు పెట్టని కోటగా ఉన్న హైదరాబాద్ సెగ్మెంట్ లో ఈసారి జెండా పాతుతామని చెప్తున్నా బీజేపీ నేతల వ్యాఖ్యలకు తగ్గట్టుగానే మాధవీలత అందరి దృష్టిని...

బీఆర్ఎస్ కు బిగ్ షాక్ – కాంగ్రెస్ లోచేరిన కేటీఆర్ బావమరిది..!

లోక్ సభ ఎన్నికల ముంగిట బీఆర్ఎస్ కు షాక్ ల మీద షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు, కీలక నేతలు పార్టీని వీడుతుండగా తాజాగా కేటీఆర్ బావమరిది ఎడ్ల రాహుల్ రావు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close