హుజూరాబాద్ రాజకీయాల్లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న మల్కాజ్గిరి ఎంపీ, బీజేపీ సీనియర్ నాయకులు ఈటల రాజేందర్ తాజాగా చేసిన వ్యాఖ్యలు మరోసారి ఆయన రాజకీయ పయనంపై చర్చలకు కారణం అయ్యేలా చేస్తున్నాయి. హుజూరాబాద్ నియోజకవర్గంతో గత 25 ఏళ్లుగా పేగు బంధం ఉన్న తనను, ఇప్పుడు అక్కడకు రావొద్దని అడ్డుకోవడంపై ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బహిరంగంగా తన బాధ చెప్పుకున్నారు.
ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో హుజూరాబాద్ నియోజకవర్గ పరిధిలోని మున్సిపాలిటీల్లో ఎన్నికల ప్రచారానికి వెళ్లేందుకు సిద్ధమైన తనను, సొంత పార్టీలోని కొందరు నేతలు నివారించారని ఈటల ఆరోపించారు. నువ్వు ఇప్పుడు మల్కాజ్గిరి ఎంపీవి.. నీ ప్రచారం నీ పార్లమెంట్ పరిధిలోనే చూసుకో, హుజూరాబాద్కు రావొద్దు అని తనకు స్పష్టం చేశారని ఆయన చెప్పారు. నియోజకవర్గంతో తనకు ఉన్న దశాబ్దాల అనుబంధాన్ని కాదని, ఇలా ఆంక్షలు విధించడం తనను తీవ్రంగా కలిచివేసిందని ఆయన చెబుతున్నారు.
తాను హుజూరాబాద్లో ఉన్నంత కాలం అక్కడ మున్సిపల్ ఎన్నికల్లో ఓటమి అనేదే లేదని ఈటల గుర్తు చేశారు. గతంలో ప్రతి ఎన్నికల్లోనూ అఖండ విజయాలు సాధించామని, కానీ తనను ప్రచారానికి రాకుండా అడ్డుకోవడం వల్లే ఇప్పుడు అక్కడ మున్సిపాలిటీల్లో ఓటమి ఎదురైందన్నారు. వరుసగా ఎమ్మెల్యేగా గెలిచి, ఉప ఎన్నికలో సైతం సత్తా చాటిన ఈటల రాజేందర్.. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయారు. ఎంపీగా మల్కాజిగిరి నుంచి గెలిచినా ఆయన హుజూరాబాద్ ను వదులుకోవాలనుకోవడంలేదు.కానీ బండి సంజయ్ ఆయనను హూజురాబాద్ లో అడుగు పెట్టనీయడండ లేదు. అయితే తన నియోజకవర్గాన్ని వదిలి పెట్టే అవకాశం ఉండదని.. సమయం వచ్చినా తిరుగుబాటు ఖాయమన్న సంకేతాలను ఈటల ఇలా ఇస్తున్నారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.
