పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ అంశంపై ఈ మధ్య ప్రధాని మోదీ, రక్షణమంత్రి రాజ్ నాథ్, హోంమంత్రి అమిత్ షా తరచూ మాట్లాడుతున్నారు. స్వాధీనం చేసుకోబోతున్నామని సంకేతాలు ఇస్తున్నారు. ముఖ్యంగా ఆపరేషన్ సిందూర్ కు.., విరామం ఇచ్చిన తర్వాత ఈ మాటలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. యుద్ధం కొనసాగించి ఉంటే పాకిస్తాన్ నుంచి పీవోకే స్వాధీనం సాధ్యమయ్యేదని కొంత మంది చెబుతూ ఉంటారు. కానీ ఇప్పుడు అసలు ప్లాన్ అమలు చేస్తున్నట్లుగా కేంద్రం సంకేతాలు ఇస్తోంది.
పీవోకే ప్రజలు మనవాళ్లేనని.. భౌగోళికంగా మాత్రం వేరుగా ఉన్నట్లుగా భావిస్తున్నారని రక్షణ మంత్రి రాజ్ నాథ్ చెప్పారు. త్వరలో వారంతా కలిసిపోతారని ఆయన చెబుతున్నారు. పాకిస్తాన్ లో చర్చలంటూ జరిగితే అది పీవోకే గురించేనని మోదీ చెబుతున్నారు. అయితే పాక్ ఆక్రమిత కశ్మీర్ ను స్వాధీనం చేసుకోవాలంటే.. ఖచ్చితంగా యుద్ధం చేయాల్సిందే. దౌత్య మార్గాలు, చర్చల ద్వారా పాకిస్తాన్ పీవోకేను భారత్ కు అప్పగించే అవకాశం ఉండదు.
పాకిస్తాన్ పై భారత్ మరో సారి దాడి చేసి పీవోకను లాక్కునే ప్లాన్ లు అమలు చేస్తున్నారా లేదా అన్నది ఎవరికీ తెలియదు. పాకిస్తాన్ పై మైండ్ గేమ్ ఆడుతున్నారన్న అభిప్రాయమూ ఉంది. భారత్ యుద్ధం చేసి ఆ ప్రాంతాన్ని కలిపేసుకుంటే పాకిస్తాన్ భారత్ కు నష్టం చేసేలా యుద్ధం చేస్తుంది. వీలైనంత వరకూ దాడులు చేస్తుంది. ఇలాంటి నష్టాలు లేకుండా… ప్రధాని మోదీ పీవోకేను కలుపుకునే ప్లాన్లను అమలు చేస్తారని ఎక్కువ మంది నమ్ముతున్నారు.