ఐపీఎల్ ఫైనల్ లో పంజాబ్ కింగ్స్ అడుగుపెట్టింది. మంగళవారం జరిగే తుది పోరులో బెంగళూరుతో తలపడబోతోంది. ఇప్పటి వరకూ అటు బెంగళూరు, ఇటు పంజాబ్ ఒక్క ఐపీఎల్ టోర్నీ కూడా గెలవలేదు. ఎవరు విజేతగా నిలిచినా.. అది చరిత్రే. 18 సీజన్ల పాటు ఐపీఎల్ కప్పు బెంగళూరుని ఊరిస్తూనే ఉంది. ‘ఈసారి కప్ మనదే’ అంటూ ప్రతీసారీ అభిమానులకు మాట ఇవ్వడం, ఉత్తి చేతులతో ఇంటికి వెళ్లడం బెంగళూరుకు ఆనవాయితీగా వస్తోంది. ఈసారి మాత్రం ఎట్టిపరిస్థితుల్లోనూ కప్పు చేజారిపోకూడదన్న కసి.. బెంగళూరు ఆటగాళ్లలో కనిపిస్తోంది. పైగా 18 అనేది కోహ్లీ జెర్సీ నెంబర్. ఇది 18వ ఐపీఎల్. సెంటిమెంట్ ప్రకారం.. కప్పు కొట్టే ఛాన్స్ బెంగళూరుదే అని అభిమానులు లెక్కలేస్తున్నారు. బెంగళూరు టాప్ ఆర్డర్ ఫామ్ లో ఉండడం, కోహ్లీ నిలకడగా ఆడుతుండడం, బౌలర్లు సమష్టిగా రాణించడం, అభిమానుల అండ, దండ ఇవన్నీ బెంగళూరుకు ప్లస్ పాయింట్స్. అయితే కీలకమైన మ్యాచ్లలో చేతులెత్తేయడం కూడా ఈ జట్టుకు ఆనవాయితేనే. అది బలహీనతగా మారకూడదు.
మరోవైపు పంజాబ్ కింగ్స్ పై ముందు నుంచీ ఎవరికీ నమ్మకాల్లేవు. కానీ ఆ జట్టు అందరినీ ఆశ్చర్యపరుస్తూ అద్భుతమైన ఫలితాల్ని అందుకొంది. ఓపెనర్లు శుభారంభాల్ని అందిస్తున్నారు. ఇంగ్లీస్ అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. క్వాలిఫయింగ్ 2లో ముంబై చేతిలోంచి మ్యాచ్ లాగేసుకోవడం వెనుక ఇంగ్లీస్ పాత్ర కీలకం. బుమ్రా ఓవర్లో 20 రన్స్ కొట్టి, ముంబై ఆత్మవిశ్వాసాన్ని దెబ్బ తీశాడు. బ్యాటింగ్ లైనప్ కూడా చాలా బలంగా ఉంది. అన్నింటికంటే ముఖ్యంగా శ్రేయాస్ అయ్యర్ జట్టుని ముందుండి నడిపిస్తున్న విధానం అబ్బుర పరుస్తోంది. ముంబైతో జరిగిన మ్యాచ్లో తను చాలా కామ్గా తన పని తాను చేసుకపోయాడు. 204 పరుగుల ఛేజింగ్ లో ఎక్కడా తడబడలేదు. విన్నింగ్ షాట్ కొట్టినా సంబరాలు చేసుకోలేదు. `కప్పు కొట్టాకే పండగ` అన్నట్టు కనిపించాడు. తన కెప్టెన్సీ కూడా గొప్పగా అనిపిస్తోంది. గతేడాది కొలకొత్తాని గెలిపించిన సారధి కూడా శ్రేయాసే. ఈసారి కూడా తానే పంజాబ్ గెలుపు గుర్రం కానున్నాడు.
మొత్తానికి ఏ జట్టు గెలిచినా అభిమానులకు ఆ సంబరం చూడడం కనుల పండుగగా ఉంటుంది. బెంగళూరు – పంజాబ్ ఫైనల్ మ్యాచ్లో ఎవరు ఫేవరెట్టో కచ్చితంగా చెప్పలేం. ఎందుకంటే రెండు జట్లూ గెలుపు కోసం చెమటోడుస్తాయి. ఆఖరి బంతి వరకూ పోరాడతాయి. కాబట్టే ఈ మ్యాచ్ రసవత్తరం కానుంది.