ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే గుంటూరు రియల్ ఎస్టేట్ హాట్ ప్రాపర్టీగా ఉండేది. ఇప్పుడు రాజధానికి దగ్గరగా మారడంతో పెద్ద ఎత్తున డిమాండ్ పెరుగుతోంది. నగరం విస్తరిస్తోంది. సిటీలో కన్నా శివారు ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో శివారు ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణం పెరుగుతోంది. లేఔట్లు వేస్తున్నారు.
గుంటూరు పట్టణం నుంచి నాలుగైదు కిలోమీటర్ల రేడియస్లో కాలనీలు ఏర్పడుతున్నాయి. చదరపు గజానికి ఆరేడు వేల నుంచి పదిహేను వేల వరకూ స్థలాలకు ధరలు పలుకుతున్నాయి. 2BHK అపార్ట్మెంట్లు రూ. 25 లక్షల నుండి రూ. 35 లక్షల వరకు లభిస్తున్నాయి. చౌడవరం, నల్లపాడు, పెదపలకలూరు గుంటూరు నగరంలో విలీనమయ్యాయి. ఈ ప్రాంతాల్లో స్థలాలు చదరపు గజానికి రూ. 6,000 నుండి క్రూ. 15,000 వరకూ పలుకుతున్నాయి. 50 లక్షలకు ఇండిపెండెంట్ హౌస్లు అమ్ముతున్నారు. 30 లక్షల నుండి 45 లక్షల వరకు డబుల్ బెడ్ రూం ఇళ్లు అమ్ముతున్నారు. పెదకాకాని, చెబ్రోలు వంటి ప్రాంతాల్లోనూ కాస్త అటూ ఇటూగా ధరలు ఇలాగే ఉన్నాయి.
ఇప్పటికీ గుంటూరు శివారు ప్రాంతాల్లో చిన్న బిల్డర్లు.. ఓ మాదిరి రియల్ ఎస్టేట్ కంపెనీలే ఇళ్లను నిర్మిస్తున్నాయి. బడా కంపెనీలు ఇంకా రంగంలోకి దిగలేదు. కొన్ని ప్రాజెక్టులు చేపట్టినా లార్జ్ స్కేల్ ప్రాజెక్టులపై ఇంకా దృష్టిపెట్టలేదు. అమరావతి నిర్మాణాలు ఊపందుకుంటే.. పెద్ద కంపెనీలు ప్రాజెక్టులు ప్రారంభించే అవకాశం ఉంది. అప్పుడు రేట్లు మరింత పెరగనున్నాయి.