సీనియర్ హీరో అర్జున్ తన కుమార్తె ఐశ్వర్యని హీరోయిన్ గా నిలబెట్టాలని ఓ సినిమాకి శ్రీకారం చుట్టారు. టైటిల్.. సీతా పయనం. ఈ సినిమాని గ్రాండ్ గా ఓపెనింగ్ చేశారు. పవన్ కళ్యాణ్ ఈ వేడుకకి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. ఈ సినిమా కోసం విశ్వక్ సేన్ ని హీరోగా తీసుకున్నారు. చాలా పాజిటివ్ బజ్ తో సినిమా మొదలైంది. కానీ షూటింగ్ మధ్యలోనే విశ్వక్సేన్ ఈ సినిమా నుంచి బయటికి వచ్చేశాడు. అప్పట్లో దీనిపై ఓ వివాదమే రేగింది.
అర్జున్ ప్రెస్ మీట్ పెట్టి మరి విశ్వక్ ని అన్ ప్రొఫెషనల్ యాక్టర్ అని విమర్శించాడు. విశ్వక్సేన్ కూడా తన వైపు నుంచి ఎలాంటి తప్పు లేదని క్లారిటీ ఇచ్చుకున్నాడు. సినిమా అనేది కలెక్టివ్ ఎఫర్ట్ అని, అంతా ఏకపక్షంగా జరిగేసరికి తనకి నచ్చక సినిమా నుంచి బయటికి రావాల్సి వచ్చిందని, నిజంగా అదొక బ్యాడ్ డే అని, అయితే బ్యాడ్ ఫిలిం కంటే బ్యాడ్ డే బెటర్ అని చెప్పుకున్నాడు.
తాజాగా ఈ సినిమా టీజర్ బయటికి వచ్చింది. టీజర్ చూసిన తర్వాత హీరోయిన్ పాత్ర కోసమే ఈ కథ రాసినట్లుగా అనిపించింది. టీజర్ లాంచ్ ఈవెంట్ లో కూడా అర్జున్ తన కూతురు కోసమే ఈ సినిమా చేశానని చెప్పాడు. అయితే ఇలాంటి కథని ముందుగా విశ్వక్ అంగీకరించడం అనేది సర్ప్రైజ్. నిజానికి 2022లో విశ్వక్ కి చెప్పిన కథ ఇది. తర్వాత విశ్వక్ ఇమేజ్ లో చాలా మార్పులు వచ్చాయి. ఆ ఇమేజ్ కి ఈ కథకి సెట్ అవ్వదనే కారణంతోనే ఏదోలా విశ్వక్ దాన్నుంచి బయటపడ్డాడని అనుకోవాలి. టీజర్ చూస్తే అదే క్లియర్ గా అర్థమైంది.
అయితే విశ్వక్ స్థానంలో నిరంజన్ అనే ఒక కొత్త నటుడిని హీరోగా తీసుకున్నారు. ఉపేంద్ర అన్నయ్య కొడుకు ఇతను. టీజర్ చూసిన తర్వాత ఒక హీరోయిన్ క్యారెక్టర్ ఎలివేట్ అవ్వాలంటే ఆల్రెడీ పాపులర్ అయిన ఒక ప్రామిసింగ్ హీరో ఉంటే బాగుండేది అనే అభిప్రాయం కలిగింది. బహుశా అర్జున్ కూడా ముందుగా విశ్వక్ ని తీసుకోవడానికి కారణం కూడా అదే. అయితే విశ్వక్ తప్పుకోవడంతో కొత్త హీరో తోనే సినిమాని పూర్తి చేశారు. మరి అర్జున్ తీసుకున్న ఈ నిర్ణయం సినిమాకి ప్లస్ అవుతుందా లేదా అనేది రిలీజ్ తర్వాత తెలుస్తుంది.