ప్రపంచంలో ఒక దాని తర్వాత ఒకటి యుద్ధం తరహా పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇప్పుడు ఇజ్రాయెల్ , ఇరాన్ మధ్య పరస్పర దాడులు జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున ప్రాణాలు, ఆస్తులు ధ్వంసం అవుతున్నాయి. రెండు దేశాల్లోనూ ఇదే పరిస్థితి. ఇరాన్ అణ్వాయుధాల్ని సమకూర్చుకుంటోందని ఇజ్రాయెల్ ఆరోపణ. అందుకే దాడి చేశామని అంటోంది. అమెరికా దానికి మద్దతిస్తోంది. నిజానికి ఇరాన్,ఇజ్రాయెల్ 1979 వరకూ మంచి స్నేహితులు.కానీ మతం ఆ రెండు దేశాల మధ్య చిచ్చుపెట్టింది.
1979కి ముుందు ఇరాన్తో ఇజ్రాయెల్ సన్నిహిత సంంబధాలు
1979కి ముందు, ఇరాన్లో షా, ఇజ్రాయెల్ సన్నిహిత మిత్ర దేశాలు. ఎంతగా అంటే ఇజ్రాయెల్ను ఒక దేశంగా గుర్తించిన రెండవ ముస్లిం దేశం ఇరాన్. రెండు దేశాలు చమురు వాణిజ్యం, సైనిక సహకారంతో పాటు వివిధ రంగాల్లో కలసి పని చేసేవి. అయితే 1979లో ఆయతొల్లా ఖొమైనీ నాయకత్వంలో ఇరాన్లో ఇస్లామిక్ రిపబ్లిక్ ను స్థాపించారు. ఖోమైనీ ఇజ్రాయెల్ను ఓ దేశంగా గుర్తించడానికి నిరాకరించారు. పాలస్తీనాకు మద్దతు ఇచ్చారు. అక్కడి నుంచి అసలు శత్రుత్వం ప్రారంభమయింది.
ఖొమైనీ ఇస్లామిక్ రిపబ్లిక్ స్థాపించిన తర్వాత మత చిచ్చు
పాలస్తీనా సమస్యను ఇరాన్ తమ విదేశాంగ విధానంలో కీలక భాగంగా చేసుకోవడంతో రెండు దేశాలు బద్ద శత్రువులయ్యాయి. అంతే కాదు ఇరాన్ హమాస్ , హిజ్బుల్లా వంటి గ్రూపులకు సైనిక, ఆర్థిక సాయం కూడా చేస్తోంది. వీటికి మద్దతు ఇచ్చి తమ దేశంపై ఇరాన్ కుట్ర చేస్తోందని ఇజ్రాయెల్ కు కోపం. అమెరికా మద్దతుతో హమాస్, హిజ్బుల్లాలను నిర్మూలించేదుకు మారణహోం చేస్తున్న ఇజ్రాయెల్.. ఇప్పుడు అణు కార్యక్రమం పేరుతో ఇరాన్ పైనా దాడి చేస్తోంది. ఇరాన్ అణ్వాయుధాలు సమకూర్చుకుంటే ఇజ్రాయెల్ ఉనికికి ముప్పు అని “ఆపరేషన్ రైజింగ్ లయన్” పేరుతో అణు స్థావరాలపై దాడులు చేస్తోంది. అణు శాస్త్రవేత్తలను చంపేస్తోంది. ఇరాన్ తాము యుద్ధం కోసం అణ్వాయుధాలు తయారు చేయడం లేదని అంటోంది. కానీ అమెరికా ఒప్పందం చేసుకోవాలని అంటోంది. అమెరికా జోక్యంతో ఈ వివాదం మరింతగా పెరుగుతోంది.
ఇజ్రాయెల్ వ్యతిరేక శక్తులకు ఇరాన్ సాయం – ఇజ్రాయెల్కు అమెరికా సపోర్ట్
ఈ రెండుదేశాల మధ్యయుద్ధ పరిస్థితులు ఏర్పడటానికి మరో కారణం ఆధిపత్యం. ఇరాన్ షియా ముస్లిం దేశం, అయితే ఇజ్రాయెల్ యూదు దేశం. ఇస్లామిక్ పాలన ..యూదు దేశాన్ని రాష్ట్రాన్ని సైద్ధాంతికంగా వ్యతిరేకిస్తుంది. ప్రజలు కూడా ఇలా మత పరంగా చీలిపోయారు. ఈ దేశాల మధ్య వివాదానికి జెరూసలెం కూడా కారణం. ఆ ప్రాంతాన్ని ఇజ్రాయెల్ లో భాగంగా ఇరాన్ గుర్తించదు. పాలస్తీనాకు చెందినదిగా చెబుతుంది. దీంతో.. రెండుదేశాల మధ్య ఉద్రిక్తతలు చల్లారడం లేదు.అంతిమంగా మతం ఇద్దరు స్నేహితులు మధ్య చిచ్చు పెట్టి.. శత్రువులుగా మార్చింది. అమెరికా లాంటి దేశాలు వీరి మధ్య మంటల్ని పెంచుతూ .. పబ్బం గడుపుకుంటున్నాయి.