తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొలువుదీరి రెండేళ్లు దాటుతున్న తరుణంలో, పాలన ఇప్పుడు ఒక కీలక మలుపు వద్ద నిలబడింది. ఇన్నాళ్లూ నెట్టుకొచ్చిన హనీమూన్ పీరియడ్ ముగిసి, ఇప్పుడు ప్రజలకు ఇచ్చిన హామీలపై జవాబు చెప్పాల్సిన అసలు సమయం వచ్చింది. ముఖ్యంగా సంక్షేమ పథకాల చుట్టూ తిరిగే రాజకీయాల్లో ఈ వచ్చే బడ్జెట్ రేవంత్ సర్కార్కు ఒక అగ్నిపరీక్ష లాంటిది.
అమూలుకు వేళాయె.. బడ్జెట్ సవాల్!
కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి ప్రధాన కారణమైన ఆరు గ్యారెంటీల్లో కొన్ని ఇప్పటికే అమలవుతున్నా , భారీ ఆర్థిక భారంతో కూడిన అసలు పథకాలు ఇంకా పెండింగ్లోనే ఉన్నాయి. ముఖ్యంగా వృద్ధాప్య పింఛన్లను 4,000 రూపాయలకు పెంచడం, మహాలక్ష్మి పథకం కింద మహిళలకు 2,500 రూపాయల నగదు బదిలీ వంటివి కోట్లాది మంది లబ్ధిదారుల జీవితాలతో ముడిపడి ఉన్నాయి. ఈ రెండు పథకాలను వచ్చే ఆర్థిక సంవత్సరం నుండి ప్రారంభించకపోతే, క్షేత్రస్థాయిలో ప్రభుత్వ వ్యతిరేకతను ఆపడం రేవంత్ రెడ్డికి సాధ్యం కాకపోవచ్చు.
విపక్షాల అస్త్రం – ప్రజల నిరీక్షణ
ప్రతిపక్ష బిఆర్ఎస్ ఇప్పటికే ఈ అంశాన్ని రాజకీయ అస్త్రంగా మార్చుకుంది. సగం పదవీకాలం ముగిసినా హామీలు ఎక్కడ అంటూ కేటీఆర్ వంటి నేతలు నేరుగా ముఖ్యమంత్రికే లేఖలు రాస్తున్నారు. మరోవైపు, ప్రజల్లో కూడా నిరీక్షణ హద్దులు దాటుతోంది. ప్రభుత్వం కేవలం బడ్జెట్ కేటాయింపులతో సరిపెడుతుందా లేదా నిజంగానే నగదును లబ్ధిదారుల ఖాతాల్లోకి మళ్లిస్తుందా అన్నది చర్చనీయాంశంగా మారింది. ఒకవేళ బడ్జెట్లో వీటికి స్పష్టమైన కేటాయింపులు లేకపోతే, అది ప్రత్యర్థులకు రాజకీయంగా పెద్ద వరంలా మారుతుంది. రాష్ట్ర ఖజానాపై ఉన్న అప్పుల భారం, కేంద్రం నుంచి అందాల్సిన నిధుల్లో కోతలు రేవంత్ రెడ్డికి ఊపిరి సలపనీయడం లేదు. కానీ, రాజకీయంగా నిలబడాలంటే మాత్రం ఈ సంక్షేమ పథకాలు అమలు చేయక తప్పని పరిస్థితి.
అగ్నిపరీక్షగా మార్చి బడ్జెట్ సెషన్
మూసీ పునరుద్ధరణ, ఫ్యూచర్ సిటీ వంటి భారీ ప్రాజెక్టుల కంటే, పేదల చేతికి వచ్చే పింఛను, మహిళలకు వచ్చే నగదు సహాయమే ఎన్నికల్లో ఓట్లు కురిపిస్తాయని రేవంత్ రెడ్డి గుర్తించాల్సి ఉంది. ఈ క్రమంలో ప్రాధాన్యతలను మార్చుకోకపోతే, అభివృద్ధి ప్రాజెక్టుల మధ్య సంక్షేమం నలిగిపోయే ప్రమాదం ఉంది. మార్చి 16 నుంచి ప్రారంభం కానున్న బడ్జెట్ సమావేశాల్లో రేవంత్ సర్కార్ ఇచ్చే స్పష్టత తెలంగాణ రాజకీయ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. కేవలం వాగ్దానాలతో కాలం గడిపే దశ దాటిపోయింది. పింఛన్ల పెంపునకు అవసరమైన అదనపు నిధులు, మహాలక్ష్మి పథకానికి అయ్యే వేల కోట్ల రూపాయలను ఎలా సమీకరిస్తారనే దానిపైనే ప్రభుత్వంపై ప్రజలకు ఉన్న విశ్వసనీయత ఆధారపడి ఉంటుంది. ఈ పరీక్షలో నెగ్గితే రేవంత్ తిరుగులేని నేతగా ఎదుగుతారు, లేదంటే ప్రజా వ్యతిరేకతను చవిచూడాల్సి వస్తుందన్న అభిప్రాయం వినిపిస్తోంది.
