పని చేయని వారికి డిమోషన్.. పని చేసే వారికి ప్రమోషన్ అని రేవంత్ రెడ్డి మరోసారి కాంగ్రెస్ పార్టీ కీలక నేతలకు హెచ్చరికలు జారీ చేశారు. పార్టీ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ సమావేశాన్ని గాంధీభవన్ లో ఏర్పాటు చేసి.. కాస్త గట్టిగానే పార్ట నేతలకు చెప్పారు. మంత్రుల వద్ద నుంచి అందరికీ ఆయన ఈ హెచ్చరికలు ఇచ్చారు. కానీ వాటి ఎఫెక్ట్ ఎంత అన్నది మాత్రం అర్థం కాని విషయం.
ఇంచార్జ్ మంత్రులకు నిధులు కేటాయించినా ఉపయోగించడం లేదనేది రేవంత్ అభియోగం. వాటిని ఉపయోగించుకుని అభివృద్ధి పనులు చేయాలంటున్నారు. అంతే కాదు స్థానిక ఎన్నికల్లో 99 శాతం స్థానాల్లో విజయం సాధించే టార్గెట్ కూడా వారిదేనని స్పష్టం చేశారు. ఆ సమయంలోనే ప్రమోషన్లు, డిమోషన్ల గురించి చెప్పారు. స్థానిక క్యాడర్ కు పదవులు ఇవ్వలేదన్న అసంతృప్తి ఉంది. ఇప్పటి వరకూ ఎందుకు ఇవ్వలేదని ఆయన పార్టీ నేతలపై మండిపడ్డారు. మార్కెట్ కమిటీలు, పాలక మండళ్లు వంటి పదవుల విషయంలో జిల్లా స్థాయిలో భర్తీ చేసుకోవాలని ఆయన సూచించారు. కానీ కాంగ్రెస్ లో అదంత తేలిక కాదు. క్యాడర్ ను బుజ్జగించడానికి అలా చెప్పినట్లుగా ఉన్నారు.
జూబ్లిహిల్స్ ఉపఎన్నిక విషయంలోనూ రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. అభ్యర్థులు ఎవరూ తామే పోటీ చేస్తామని చెప్పుకవద్దని స్పష్టం చేశారు. అజరుద్దీన్ ఇటీవల అవే ప్రకటనలు చేస్తున్నారు. హైకమాండ్ అభ్యర్థిని ప్రకటిస్తుందని గెలిపించడమే కర్తవ్యమని చెప్పుకొచ్చారు. రేవంత్ రెడ్డి .. పార్టీ సమావేశాల్లో.. ఎమ్మెల్యేలతో సమావేశాల్లో ఇలా సీరియస్ గా వార్నింగ్ లు ఇవ్వడం కామన్ గా మారిపోయింది. కానీ నేతల పనితీరులో మాత్రం పెద్దగా మార్పు కనిపించడం లేదని గాంధీభవన్లో సెటైర్లు వినిపిస్తున్నాయి.