తనపై నమోదు అయిన భూవివాదం కేసును క్వాష్ చేయాలని గతంలో రేవంత్ రెడ్డి దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరిగింది. శేరిలింగంపల్లిలోని గోపన్ పల్లిలో భూవివాదానికి సంబంధించిన కేసు వ్యవహారంలో ఆయన క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై హైకోర్టు ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది. ఇరు వర్గాల వాదనలు విన్న అనంతరం ధర్మాసనం విచారణకు ఈ నెల 26వ తేదీకి వాయిదా వేసింది..
గోపన్ పల్లిలోని సర్వే నెంబర్ 127కు సంబంధించి రేవంత్ రెడ్డిపై 2016లోనే గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేశారు. చార్జీషీట్ కూడా దాఖలు చేశారు. ఈ భూవివాదంలో రేవంత్ రెడ్డి హస్తం ఉందని పోలీసులు పేర్కొన్నారు. ఈ కేసులో రేవంత్ , ఆయన సోదరుడు కొండల్ రెడ్డితోపాటు లక్ష్మయ్య అనే వ్యక్తిని చేర్చారు.
అయితే, ఇదంతా రేవంత్ పై కక్షపూరితంగా కేసు నమోదు చేశారని ఆరోపణలు కూడా ఉన్నాయి. అప్పటి నుంచి ఈ కేసుపై విచారణ జరుగుతోంది. దీంతో ఈ కేసును క్వాష్ చేయాలని కోరుతూ రేవంత్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. శుక్రవారం మరోసారి విచారణ చేపట్టిన కోర్టు.. విచారణను ఈ నెల 26వ తేదీకి వాయిదా వేసింది.