నియోజకవర్గాల డీలిమిటేషన్ అనే లీక్ రాగానే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఉద్యమం ప్రకటించేశారు. దక్షిణాదికి అన్యాయం అని పోరాటానికి అందరూ కలసి రావాలని పిలుపునిచ్చారు. 2026 తర్వాత జరగబోయే నియోజకవర్గాల పునర్విభజనలో జనాభా ప్రాతిపదికన సీట్లు పెంచితే, జనాభా నియంత్రణను సమర్థవంతంగా అమలు చేసిన దక్షిణాది రాష్ట్రాలు శిక్షకు గురవుతాయని ఆయన వాదిస్తున్నారు. యాభై శాతం సీట్నను పెంచినా ఉత్తరాది రాష్ట్రాలైన యూపీ, బీహార్ వంటి చోట్ల సీట్లు భారీగా పెరిగి, దక్షిణాది ప్రాతినిధ్యం తగ్గిపోతే.. రేపటి రోజున ఢిల్లీలో ఎవరు పీఠం ఎక్కాలో నిర్ణయించే శక్తి దక్షిణ భారతం కోల్పోతుందనేది ఆయన ప్రధాన ఆందోళన. దీనిని ఆయన దక్షిణాదిపై ప్రయోగించబోయే ఆఖరి బుల్లెట్ గా అభివర్ణిస్తున్నారు.
తమిళనాడు తోడు.. ఏపీ మౌనం
రేవంత్ రెడ్డి వినిపిస్తున్న దక్షిణాదికి అన్యాయం అనే వాదనకు తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ నుండి బలమైన మద్దతు లభించే అవకాశం ఉంది. ద్రావిడ సిద్ధాంతం, రాష్ట్రాల స్వయంప్రతిపత్తిపై స్టాలిన్ ఇప్పటికే కేంద్రంతో పోరాడుతున్నారు. అయితే ఆయన మళ్లీ అధికారంలోకి వస్తేనే వినిపిస్తారు. ఓడిపోతే.. బీజేపీ భయంతో ఆయన సైలెంట్ గా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ విషయంలో పరిస్థితి భిన్నంగా ఉంది. టీడీపీ ఎన్డీఏ కూటమిలో ఉంది. వైసీపీలు బీజేపీకి ఎప్పుడూ సలాం కొడుతూనే ఉంది. జగన్ మోహన్ రెడ్డి కేంద్రంతో ఘర్షణ పడే వైఖరిని ప్రదర్శించకపోవడంతో, ఏపీ నుండి రేవంత్ ఆశించిన మద్దతు లభించకపోవచ్చు. కేరళలోని కమ్యూనిస్టు ప్రభుత్వం ఈ విషయంలో రేవంత్తో కలిసి నడిచే అవకాశం ఉన్నా ఎన్నికల ఫలితాలే ఎంత బలంగా ఈ మద్దతు లభిస్తుందా అన్నది తేలాల్సి ఉంది.
అన్యాయం జరుగుతోందని ప్రజలు నమ్మితేనే స్పందన
రాజకీయ నాయకుల వాదనలు ఎలా ఉన్నా, ప్రజలు దీనిని ఎలా స్వీకరిస్తారనేదే అసలు ప్రశ్న. అభివృద్ధిలో ముందున్న దక్షిణాది రాష్ట్రాల పన్నుల ఆదాయం ఉత్తరాది రాష్ట్రాలకు ఎక్కువగా మళ్ళుతోందనే భావన ఇప్పటికే దక్షిణాది ప్రజల్లో ఉంది. ఇప్పుడు రాజకీయ ప్రాతినిధ్యం కూడా తగ్గిపోతుందనే ప్రచారం గట్టిగా సాగితే, ఇది సెంటిమెంట్గా మారే అవకాశం ఉంది. ప్రజలు దీనిని తమ ఆత్మగౌరవ సమస్యగా భావిస్తే రేవంత్ రెడ్డి హీరో అవుతారు.
జాతీయ స్థాయిలో కాంగ్రెస్ విధానం ఎలా ఉంటుందో?
జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉంటూ దక్షిణాది-ఉత్తరాది అనే విభజన రేఖను రేవంత్ గీయడం పార్టీ అధిష్టానానికి సంకట స్థితిని కలిగిస్తోంది. ఉత్తరాదిలో తిరిగి పుంజుకోవాలని చూస్తున్న కాంగ్రెస్, రేవంత్ వ్యాఖ్యలను బహిరంగంగా సమర్థిస్తే అక్కడ నష్టం జరుగుతుందనే భయం ఉండవచ్చు. అందుకే ఇంకా.. డీలిమిటేషన్ అంశంపై కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో అధికారికంగా స్పందించలేదు. కేంద్రం ఈ బిల్లుపై పూర్తి స్థాయిలో కసరత్తు ప్రారంభించిన తర్వాతే అసలు రాజకీయం ప్రారంభమవుతుంది.


