హైదరాబాద్ లో జరిగిన జై హింద్ యాత్రలో తెలుగులో రేవంత్ రెడ్డి ప్రసంగించారు. రాఫెల్ జెట్లు ఎన్ని కూలిపోయాయో రాహుల్ గాందీ అడుగుతున్నా చెప్పడం లేదని కేంద్రంపై మండిపడ్డారు. మోదీపై తీవ్ర విమర్శలు చేశారు. నిజానికి ఆ ర్యాలీకి తెలుగు రాష్ట్రాల మీడియాలో పెద్దగా ఫోకస్ రాలేదు. సీఎం కాబట్టి ప్రోటోకాల్ ప్రకారం ఇవ్వాలని కాసేపు లైవ్ ఇచ్చారు. కానీ రేవంత్ ప్రసంగం అయిపోయిన కాసేపటికి జాతీయ స్థాయిలో వైరల్ అయిపోయింది. ఆ ప్రకంపనలు ఇప్పటికీ సాగుతున్నాయి.
రాహుల్ గాంధీ.. భారత్, పాక్ యుద్ధంలో జరిగిన నష్టం వివరాలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. పాకిస్తాన్ ఏమేమి కూల్చామో చెబుతోందని .. అవన్నీ నష్టపోయామో లేదో చెప్పాలని రాహుల్ డిమాండ్ చేస్తున్నారు. యుద్ధం అన్నాక రెండు వైపులా నష్టం ఉంటుందని.. మనమేం నష్టపోయామో చెప్పి శత్రు దేశానికి చాన్స్ ఇవ్వకూడదని ఆర్మీ అంటోంది. అయితే కాంగ్రెస్ నేతలు మాత్రం చెప్పాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. రాహుల్ డిమాండ్ తోనే బీజేపీ నేతలు ఆయనను ప్రో పాకిస్తానీ అని విమర్శలు చేస్తున్నారు. ఇప్పుడు వారికి రేవంత్ టార్గెట్ అయ్యారు.
బీజేపీ జాతీయ నాయకత్వం, సోషల్ మీడియా రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసుకున్నారు. రాహుల్, రేవంత్ పాకిస్తాన్ కు పీఆర్వోలుగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు చేయడం ప్రారంభించారు. రేవంత్ తెలుగులో మాట్లాడిన మాటలకు జాతీయ స్థాయిలో ఇంత ఫోకస్ రావడంతో.. ఆయన జాతీయ స్థాయిలో కీలక నేతగా మారారని అందుకే.. జాతీయ మీడియా కూడా హైలెట్ చేస్తోందని అంటున్నారు. రేవంత్ ఫోకస్ బాగా పెరిగిందని ఆయన అనుచరులు హ్యాపీ ఫీలవుతున్నారు.