తెలంగాణ కాంగ్రెస్ లో పదవుల కసరత్తు ఈ సారి పూర్తి అయిపోతుందని అనుకున్నారు ఆశావహులు. ముఖ్యమంత్రి మూడు రోజుల పాటు ఢిల్లీలో ఉండి అందర్నీ కలిసి ఈ సారికి క్యాడర్ ఆశల్ని మోసుకుంటూ వద్దామని అనుకున్నారు. కానీ ఒకరి తర్వాత ఒకరి ఆమోదం పొందాల్సి రావడంతో కసరత్తు ఆగిపోయింది. ఖర్గే ఢిల్లీలో లేకపోవడంతో మళ్లీ రావాలని చెప్పి పార్టీ నేతల్ని ఇప్పటికి పంపించి వేశారు. నెలాఖరులో ముఫ్పయ్యో తేదీన మిగిలిన విషయాలు మాట్లాడదామని కబురు పంపారు. దీంతో సీఎం రేవంత్, పీసీసీ చీఫ్ మహేష్.. ఎప్పట్లాగే.. త్వరలో అనే కబురుతో తిరిగి వస్తున్నారు.
ఇదిగో..అదిగో అంటూ రోజులు..వారాలు.. నెలలు గడిచిపోతున్నాయి. కాంగ్రెస్ పార్టీ నేతల ఎదురుచూపులు మాత్రం ఫలించడం లేదు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. పార్టీ కార్యవర్గాన్ని కూడా లేకుండా నెలల తరబడి ఎదరుచూసేలా చేయడం ఏమిటని.. కాంగ్రెస్ హైకమాండ్ అంత తీరిక లేకుండా ఉందా అన్న విమర్శలు సొంత పార్టీలోనే వస్తున్నాయి. అధికారంలో ఉన్న పార్టీకి పదవుల పోటీ ఎప్పుడూ ఉంటుంది. ఈ కారణంగా వాయిదాలు వేసుకోవడం అంటే సమస్యలను పెద్దవి చేసుకోవడమే అని నేతలు గొణుక్కుంటున్నారు.
సీఎం రేవంత్ రెడ్డి కూడా ఏమీ చేయలేని పరిస్థితి ఏర్పడింది. అన్ని సమీకరణాలు చూసుకుని ఫలానా వాళ్లకు పదవులు ఇవ్వాలని సిఫారసు చేస్తే.. ఇతర నేతల నుంచి పోటీగా మరో జాబితా వెళ్తోంది. రేవంత్ రెడ్డికి ఏకపక్ష ప్రాధాన్యత ఇవ్వలేకపోతున్న హైకమాండ్.. ఆయనకు పోటీగా వచ్చేవారిని ప్రోత్సహించినట్లుగా కనిపించేందుకు ప్రయత్నిస్తోంది. వారి సిఫారసులకూ విలువ ఉన్నట్లుగా చేస్తోంది. దీంతో పదవుల పంచాయతీ అలా కొనసాగుతోంది.