తెలంగాణ శాసనసభలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చ, అధికార కాంగ్రెస్ , ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య ఒక రసవత్తర యుద్ధానికి వేదికైంది. అయితే, ఈ పోరులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనదైన శైలిలో విరుచుకుపడుతూ బీఆర్ఎస్ శ్రేణులను ఆత్మరక్షణలో పడేశారు. ముఖ్యంగా కేటీఆర్ వంటి వారు ఉన్నప్పటికీ, రేవంత్ రెడ్డిని ధీటుగా ఎదుర్కోవడంలో బీఆర్ఎస్ విఫలమైంది. రేవంత్ రెడ్డి అటు రాజకీయ విమర్శలతో పాటు, ఇటు పాలనాపరమైన అంశాలను కూడా ప్రస్తావిస్తూ గులాబీ పార్టీని ఇరకాటంలో పెట్టారు.
పాత అస్త్రాలతోనే కేటీఆర్.. కొత్త వ్యూహంతో రేవంత్
ఈ చర్చలో కేటీఆర్ ప్రసంగం అంతా పాత ఆరోపణల చుట్టూనే తిరిగింది. ఆరు గ్యారెంటీల అమలు, రుణమాఫీ వంటి అంశాలపై ఆయన చేసిన విమర్శలను మంత్రులు అప్పటికప్పుడు తిప్పికొట్టారు. ముగిసిన అధ్యాయం లాంటి అంశాలను మళ్ళీ మళ్ళీ ప్రస్తావించడం వల్ల ప్రజల్లోకి వెళ్లాల్సిన గట్టి సందేశం పలచబారిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరోవైపు, రేవంత్ రెడ్డి అత్యంత వ్యూహాత్మకంగా వ్యవహరించారు. గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలోని లోపాలను ఎండగడుతూనే, తమ ప్రభుత్వం భవిష్యత్తులో చేయబోయే పనులపై తెలంగాణ రైజింగ్-2047 వంటి విజన్ డాక్యుమెంట్లను ప్రస్తావించి సభను తన వైపు తిప్పుకున్నారు.
మూసీ ప్రాజెక్టుపై రివర్స్ అటాక్
ముఖ్యంగా మూసీ పునరుజ్జీవనంపై బీఆర్ఎస్ చేస్తున్న విమర్శలను రేవంత్ రెడ్డి అత్యంత చాకచక్యంగా తిప్పికొట్టారు. గతంలో కేసీఆర్, కేటీఆర్ మూసీ నదిపై చేసిన వ్యాఖ్యల తాలూకు వీడియోలను సభలో ప్రదర్శించి, వారి ద్వంద్వ వైఖరిని ఎండగట్టారు. అక్రమ కట్టడాలను బుల్డోజర్లతో కూల్చాలని అప్పుడు చెప్పింది మీరు కాదా అని రేవంత్ ప్రశ్నించినప్పుడు, బీఆర్ఎస్ సభ్యుల దగ్గర సరైన సమాధానం లేకపోయింది. కేటీఆర్ కేవలం సోషల్ మీడియా వేదికగా చేసే విమర్శలను సభలోనూ పునరావృతం చేయడం వల్ల, రేవంత్ వేసిన ప్రత్యూహాల ముందు అవి నిలబడలేకపోయాయి.
అంచనా తప్పిన కేటీఆర్?
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కేటీఆర్ ఎప్పటిలాగే తక్కువ అంచనా వేయడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని భావిస్తున్నారు. రేవంత్ రెడ్డి కేవలం వాక్చాతుర్యంతోనే కాకుండా, గణాంకాలు పాత రికార్డులతో సిద్ధమై రావడంతో బీఆర్ఎస్ శిబిరంలో గందరగోళం నెలకొంది. పైగా, ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ సభకు హాజరు కాకపోవడాన్ని రేవంత్ తీవ్రంగా తప్పుబట్టారు. రూ. 1.06 కోట్ల జీతభత్యాలు తీసుకుంటూ సభకు రాకపోవడంపై ఆయన చేసిన వ్యాఖ్యలు బీఆర్ఎస్కు ఇబ్బందికరంగా మారాయి.
గెలుపు సవాల్తో రేవంత్ దూకుడు
రాజకీయంగా రేవంత్ రెడ్డి ఒక అడుగు ముందుకు వేసి, మరోసారి గెలిచి చూపిస్తాం అని విసిరిన సవాల్ కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపింది. అసెంబ్లీలో చర్చా సమయం ఎక్కువ తీసుకున్నప్పటికీ, ప్రజలకు కనెక్ట్ అయ్యేలా మాట్లాడటంలో రేవంత్ రెడ్డి సక్సెస్ అయ్యారు. కానీ, బీఆర్ఎస్ తరపున మాట్లాడిన నాయకులు కేవలం పాత చింతకాయ పచ్చడి లాంటి విమర్శలకే పరిమితం కావడంతో, అసెంబ్లీ వేదికగా రేవంత్ రెడ్డిని కట్టడి చేసే అవకాశం చేజారిపోయింది. రాబోయే రోజుల్లో అయినా కేటీఆర్ తన వ్యూహాన్ని మార్చుకోకపోతే, అసెంబ్లీలో రేవంత్ రెడ్డిని ఢీకొట్టడం కష్టమేనని స్పష్టమవుతోంది.


