షష్టిపూర్తి సినిమాపై ఫోకస్ పడడానికి రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి.. ఈ చిత్రానికి ఇళయరాజా సంగీతం అందించడం. రెండోది ‘లేడీస్ టైలర్’ జంట రాజేంద్ర ప్రసాద్, అర్చన దాదాపు 40 ఏళ్ల తరవాత కలసి నటించిన సినిమా ఇది. పైగా… అచ్చ తెలుగు టైటిల్. దాంతో ఈ సినిమా ఎలా ఉంటుందా? అనే ఆసక్తి మొదలైంది. మరి ఈ సినిమా ఎలా ఉంది? ఇళయరాజా పాటల కోసం, రాజేంద్ర ప్రసాద్ నటన కోసం, అర్చన రీ ఎంట్రీ కోసం ఈ సినిమా చూడొచ్చా?
శ్రీరామ్ (రూపేష్) ఓ లాయర్. నీతి, నిజాయితీలే ప్రాణం. అబద్ధం పొరపాటున కూడా చెప్పడు. దాంతో తనకు స్నేహితులు కూడా ఉండరు. సంపాదన కూడా అంతంత మాత్రమే. జానకి (అకాంక్షసింగ్)ని ఇష్టపడతాడు. జానకి కూడా శ్రీరామ్ ని ప్రేమిస్తుంది. కానీ నీతి, నిజాయితీల వల్ల ఒరిగేదేం ఉండదని, లౌక్యంగా బతకాలని, అబద్ధాలు చెప్పడం తప్పు కాదని, అలా ఉంటేనే పెళ్లి చేసుకొంటానని కండీషన్ పెడుతుంది. మరి ఆ కండీషన్కి శ్రీరామ్ ఒప్పుకొన్నాడా? తరవాత ఏమైంది? అసలు శ్రీరామ్ అమ్మానాన్నలు (అర్చన, రాజేంద్ర ప్రసాద్)ల కథేమిటి? వాళ్ల జీవితం ఎలా ఉంది? అనేది మిగిలిన స్టోరీ.
ఈ సినిమాకి ‘షష్టిపూర్తి’ అనే పేరు ఎందుకు పెట్టారన్నది ప్రధానమైన ప్రశ్న. అసలు ఈ పేరుకీ, కథకీ సంబంధమే ఉండదు. చివర్లో టైటిల్ జస్టిఫికేషన్ కోసం అమ్మానాన్నలతో షష్టిపూర్తి చేయించారు. మధ్యలో ఓ ప్రవచనంలో షష్టిపూర్తి ప్రాధాన్యత వినిపించారు. అంతే. షష్టిపూర్తి, అమ్మానాన్నల కథ.. అనుకొని థియేటర్లలోకి వెళ్తే.. దర్శకుడు వేరే కథ చూపించే ప్రయత్నం చేశాడు. ఇంట్రవెల్ బ్యాంగ్ దగ్గర ఎందుకో ‘ఏప్రిల్ 1 విడుదల’ సినిమా గుర్తొస్తుంది. అందులో రాజేంద్ర ప్రసాద్ కి శోభన ఓ కండీషన్ పెడుతుంది. ‘నెల రోజుల పాటు నువ్వు నిజాలే చెప్పాలి’ అని. ఇందులో ఆ కండీషన్ రివర్స్ అయ్యింది. ‘నువ్వు అబద్ధాలు చెప్పాలి..’ అంటుంది హీరోయిన్. నీతి నిజాయతీలను నమ్ముకొన్న హీరో ఆ తరవాత ఏం చేశాడన్నది ‘షష్టిపూర్తి’.
‘ఏప్రిల్ 1 విడుదల’లో హీరోయిన్ కండీషన్ పెట్టడానికి బలమైన కారణం ఉంటుంది. దానికి ముందూ, వెనుక మంచి డ్రామా ఉంది. తాను చెప్పే నిజాల వల్ల కొంపలు కొల్లేరవుతాయి. చివరికి హీరో పీకల మీదకు వస్తుంది. అదంతా ఫన్తో నడించాడు వంశీ. ఇక్కడ ఆ డ్రామా, ఆ ఫన్ మిస్ అయ్యింది. హీరో నిజాలు చెప్పినా, అబద్ధాలు చెప్పినా పెద్ద తేడా ఉండదు. హీరోయిన్ ఇలా కండీషన్ పెట్టడానికి కూడా పెద్దగా కారణం కనిపించదు.
అమ్మానాన్నల కథ ఎక్కడో శుభం కార్డుకు ముందు వస్తుంది. ఆ కథ కూడా చప్పగానే ఉంటుంది. రాజేంద్ర ప్రసాద్, అర్చనల మధ్య ‘ముదురు’ ప్రేమకథ చూడడానికి చాలా ఓపిక కావాలి. ఆ ఫ్లాష్ బ్యాక్లో ఏదో గొప్ప లవ్ స్టోరీ ఉంటుందనుకొంటే, అక్కడ కూడా సందేశాలతో కాలక్షేపం చేశాడు దర్శకుడు. స్నేహితుడి కోసం రాజేంద్ర ప్రసాద్ చేసిన త్యాగం కూడా రిజిస్టర్ కాలేదు. ఆఖర్లో కోర్ట్ రూమ్ డ్రామా కూడా రక్తి కట్టలేదు. ఇంట్రవెల్ లో హీరోయిన్ పాత్రకో ట్విస్టు ఉంటుంది. ‘హీరోయిన్ ఇలా ఎందుకు చేసింది’ అనే క్వశ్చన్ మొదలవుతుంది. కానీ అంతలోనే అది కూడా తుస్ మంటుంది. ఈ సినిమాలో చాలా సన్నివేశాలు ఇలానే తేలిపోతూ ఉంటాయి. దర్శకుడిలోని అనుభవరాహిత్యం చాలా సందర్భాల్లో కనిపిస్తుంటుంది. ప్రతీ సన్నివేశానికీ ప్రారంభం, ముగింపు ఉంటాయి. అవి రెండూ ప్రతీ సన్నివేశంలోనూ పేలవంగా కనిపిస్తుంటాయి. తెరపై రాజేంద్ర ప్రసాద్ లాంటి నటుడు కూడా తేలిపోతున్నాడంటే.. సన్నివేశాల్లో ఉన్న బలం ఏమిటో అర్థం చేసుకోవొచ్చు. క్యారెక్టరైజేషన్లోనూ కంటిన్యుటీ ఉండదు. గుళ్లో హీరోయిన్ డొనేషన్ తీసుకొంటున్నప్పుడు స్పీచ్ పీకుతుంది. నీతి – నిజాయతీ, ప్రజలు, సేవ.. అంటుంది. కట్ చేస్తే.. అదే హీరోయిన్ హీరోతో.. ‘నీతి నిజాయతీ అంటే బతకలేం’ అన్నట్టు మాట్లాడుతుంది. హీరో కూడా ‘నువ్వు అబద్ధాలు చెప్పు’ అంటే టక్కున ఒప్పేసుకొంటాడు. తన క్యారెక్టరైజేషన్ ఏమైంది?
రూపేష్కి ఇదే మొదటి సినిమా. నిర్మాత కూడా తానే. రెండు బాధ్యతలు మోయాల్సివచ్చింది. రూపేష్ తన నటనలో, హావభావాల ప్రదర్శనలో మరింత మెరుగు అవ్వాల్సిన అవసరం ఉంది. ఆకాంక్ష సింగ్కు మంచి పాత్రే దక్కింది. అయితే తన క్యారెక్టరైజేషన్లో లోపాలున్నాయి. రాజేంద్ర ప్రసాద్ గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది? ఆయన్ని 30 ఏళ్ల వయసులో చూపించినప్పుడు మాత్రం కాస్త ఇబ్బందిగా అనిపించింది. అర్చన విషయంలోనూ అంతే.
ఇళయరాజా సంగీతాన్ని అందించారు. ఆయన స్టైల్ మూడు పాటల్లో కనిపించింది.. వినిపించింది. పాటలు వింటుంటే ఇళయరాజా పాత పాటలే మళ్లీ గుర్తొస్తాయి. బహుశా చిత్రబృందం కూడా ఇళయరాజా నుంచి అదే ఆశించి ఉండొచ్చు. బ్యాగ్ గ్రౌండ్ స్కోర్లో మాత్రం మాస్ట్రోలో మ్యాజిక్ కనిపించలేదు. లొకేషన్లు బాగున్నాయి. గోదావరి అందాల్ని బాగా క్యాప్చర్ చేశారు. నిర్మాణంలో క్వాలిటీ ఉంది. దర్శకుడి పాయింట్ బాగుంది. ఏప్రిల్ 1 విడుదల పాయింట్ ని రివర్స్ చేయాలి అనుకోవడం మంచి ఐడియా. రాజేంద్ర ప్రసాద్ పాత్రకు దివాకరం అనే పేరు పెట్టడం కూడా అందుకోసమే. కానీ ఆ ఐడియాని సినిమాగా తర్జుమా చేయడంలో తడబాటుకు గురయ్యాడు.