తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రాను రాను మరింత విస్తృతం అవుతోంది. తన ఫోన్లు ట్యాప్ అయిన మాట నిజమేనని షర్మిల ప్రకటించారు. అంతకు ముందు తాను నమ్మలేదని కానీ వైవీ సుబ్బారెడ్డి తన ఇంటికి వచ్చి మరీ చెప్పారని.. తన ఆడియో క్లిప్ వినిపించారన్నారు. అప్పుడు నమ్మక తప్పలేదన్నారు. తన ఫోన్లు మాత్రమే కాదని తన భర్త , సన్నిహితుల ఫోన్లన్నింటినీ ట్యాప్ చేశారన్నారు.
తన రాజకీయ జీవితాన్ని నాశనం చేయడానికే ఇలా చేశారని షర్మిల ఆరోపిస్తున్నారు. తనతో రాజకీయంగా కలసి వచ్చే వాళ్ల గురించి , ఆర్థికంగా సాయం చేసే వారి గురించి ట్యాపింగ్ ద్వారా తెలుసుకుని వారిని భయ పెట్టారని.. తనను రాజకీయంగా బలహీనం చేశారని ఆరోపించారు. ట్యాపింగ్ బాధితురాలిగా.. తాను ఎక్కడికి వచ్చి అయినా స్టేట్ మెంట్ ఇస్తానని ప్రకటించారు.
అప్పట్లో జగన్ రెడ్డికి, కేసీఆర్ కు అవినావభావ సంబంధం ఉందన్నారు. వారి మధ్య సంబంధంతో రక్త సంబంధం కూడా చిన్నబోయిందని సెటైర్ వేశారు. షర్మిల ఆరోపణలు ఆషామాషీగాలేవు. నేరుగా సుబ్బారెడ్డి పేరు చెప్పి ఆయనే తనకు ట్యాప్ అవుతున్నాయని చెప్పి.. ఆడియో క్లిప్ కూడా వినిపించారని బయట పెట్టారు. ఇప్పుడు సుబ్బారెడ్డి దాన్ని ఖండించాల్సి ఉంది. మరి ఖండిస్తారో.. సైలెంటుగా గా ఉంటారో చూడాల్సి ఉంది.