తెలుగులో నిన్నామొన్నటిదాకా నెంబర్ వన్ చానల్గా ఉన్న టీవీ9లో పరిణామాలు అనూహ్యంగా మారుతున్నాయి. కొత్త యాజమాన్యం ప్రతినిధిగా మొత్తం వ్యవహారం చక్కబెట్టడానికి చానల్లోకి వచ్చిన సింగారావు దెబ్బకు… రవిప్రకాష్ తర్వాత అంతా తానే అన్నట్లుగా వ్యవహరించిన రజనీకాంత్ బయటకు వెళ్లిపోవాలని అనుకున్నారు. ఈ మేరకు అంతా సిద్ధమయింది. కానీ చివరి క్షణంలో అనూహ్యంగా మేనేజ్మెంజ్లోని ఓ వర్గం బలమైన మద్దతుతో రజనీకాంత్ మళ్లీ పట్టు సాధించారు.
ఇప్పుడు సింగారావునే బయటకు పంపేసినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే టెన్ టీవీవ్యవహారాలను చూసుకుంటున్న సింగారావుకు కొత్త యాజమాన్యం టీవీ9 బాధ్యతలు కూడా ఇచ్చింది. యాజమాన్యానికి అత్యంత విశ్వాసపాత్రుడు కావడంతో సింగారావు చెప్పినట్లే నడుస్తూ వస్తోంది. ఈ క్రమంలో రజనీకాంత్ కు ఆయనకు మధ్య విబేధాలు వచ్చాయి. కొద్దికొద్దిగా రజనీకాంత్ ప్రాధాన్యాన్ని తగ్గిస్తూ పోయారు. చివరికి ఈ పరిస్థితి రజనీకాంత్ ఎగ్జిట్కు కారణం అవుతుందని అనుకున్నారు. ఆయన వెళ్లిపోవడం దాదాపు ఖాయం అయిన తర్వాత పరిస్థితులు మారాయి.
రజనీకాంత్ ను దూరం చేసుకోవడం కన్నా… సింగారావును దూరం పెట్టడం మంచిదనుకున్నారు కొత్త యాజమాన్యం. ఇప్పటికే రేటింగ్స్లో నెంబర్ టూకి చానల్ పడిపోయింది. ఒక్క సారి పతనం ప్రారంభమయితే..ఆపడం ఎవరి తరం కాదు. మొత్తానికి రవిప్రకాష్ ఎపిసోడ్ దగ్గర్నుంచి టీవీ9లో వచ్చేవార్తలకన్నా ఇతర కారణాలతోనే టీవీ9నే మీడియా సర్కిల్స్లో హైలెట్ అవుతోంది.