ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక సూత్రధారిగా ఉన్న ప్రభాకర్ రావు ఇండియాకు తిరిగి రావడంతో సిట్ అధికారులు దూకుడు పెంచారు. వరుసగా ప్రభాకర్ రావును విచారించిన సిట్ అధికారులు ఆయన నుంచి కీలక సమాచారాన్ని సేకరించారు. కాంగ్రెస్ , బీజేపీ నేతలతోపాటు బీఆర్ఎస్ నేతల ఫోన్లు కూడా ట్యాప్ చేసినట్లుగా తెలుస్తోంది.
ఫోన్ ట్యాపింగ్ పై విచారణ జరుపుతున్న సిట్.. ఫోన్ ట్యాపింగ్ అయిందని అనుమానిస్తున్న వారి నుంచి వాంగ్మూలాలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా మంగళవారం టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్టేట్ మెంట్ ను రికార్డు చేశారు. ప్రభాకర్ రావు విచారణ తర్వాత బీజేపీ ఎంపీలు ఈటల , ధర్మపురి అరవింద్, రఘునందన్ రావు ఫోన్ ట్యాప్ అయినట్లుగా కూడా సిట్ గుర్తించింది.
సాధారణ ఎన్నికల సమయంలో ఈ ముగ్గురి ఫోన్లు ట్యాప్ అయ్యాయని గుర్తించింది సిట్. దీంతో బుధవారం బీజేపీ ఎంపీలు ముగ్గురూ సిట్ ముందు హాజరయ్యే అవకాశం ఉంది. 2023 నవంబర్ 15 నుంచి ఈ ముగ్గురి ఫోన్లు ట్యాప్ చేసినట్లు ఆధారాలు సేకరించారు పోలీసులు.బీజేపీ నేతలు, వాళ్ల ముఖ్య అనుచరులు, కుటుంబ సభ్యుల ఫోన్లు సైతం ట్యాప్ చేశారని గుర్తించారు.
బీజేపీ నేతల రాజకీయ ఎత్తుగడలను ఎప్పటికప్పుడు తెలుసుకున్న ప్రభాకర్ రావు.. వారికి ఆర్థికసహాయం చేస్తున్న వారి ఫోన్లు ట్యాపింగ్ చేసి.. ఆ సమాచారాన్ని భుజంగరావుకు చేరవేసినట్లు సమాచారం. దాంతో ఆయన బీజేపీ నేతల నియోజకవర్గాల్లోని బీఆర్ఎస్ నాయకులకు సమాచారం అందించేవారని తెలుస్తోంది.