ఆర్సీబీ గెలుపు సంబరాల్లో విషాదం చోటు చేసుకుంది. బెంగళూరులోని చిన్న స్వామి స్టేడియంలో ఆర్సీబీ ఆటగాళ్లకు కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. స్టేడియం వెలుపల ఉన్న ఫ్యాన్స్ ఒక్కసారిగా దూసుకురావడంతో తొక్కిసలాట చోటు చేసుకుంది.
అభిమాన క్రికెటర్లను చూసేందుకు ఆర్సీబీ అభిమానులు చిన్నస్వామి స్టేడియం గేట్లు, సమీపంలోని గోడలు, చెట్లు ఎక్కారు. గేట్-2 నుంచి స్టేడియంలోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. ఆర్సీబీ అభిమానులను కంట్రోల్ చేసేందుకు పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. దీంతో ముందుకు వచ్చిన ఫ్యాన్స్ తిరిగి వెనక్కి వెళ్లేందుకు ప్రయత్నించగా ఈ తొక్కిసలాట చోటు చేసుకున్నట్లు సమాచారం.
ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందగా… 37మందికి గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను శివాజీనగర్లోని బౌరింగ్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో పదిమందిని ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు.