తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవిపై ఉత్కంఠ ఏర్పడింది. ఆ పదవి కోసం చాలా మంది సీనియర్లు గట్టిగా ప్రయత్నిస్తున్నారు. ఇందులో ఆరెస్సెస్ నుంచి బీజేపీలోకి వచ్చిన వారు.. ఏబీవీపీ నుంచి పార్టీలో ఎదిగినవారు.. తప్పనిసరి పరిస్థితుల్లో పార్టీలో చేరిన వారు కూడా ఉన్నారు. పార్టీ హైకమాండ్ ఎవరికి ప్రాధాన్యమిస్తుందన్నది మాత్రం కనీస సూచనగా కూడా బయటకు రాలేదు.
ఏడాది కిందట కేంద్ర మంత్రివర్గం ఏర్పడినప్పుడు ఈటల రాజేందర్ కు పదవి ఖాయమని అనుకున్నారు. కానీ ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వచ్చింది. ఇప్పుడు ఆయన రేసులో ఏ స్థానంలో ఉన్నారో అర్థం కావడం లేదు. బీఆర్ఎస్, బీజేపీ విలీన వార్తలతో ఈటల కూడా తన వ్యూహాన్ని మార్చారు. బీఆర్ఎస్ పై.. కేసీఆర్ పై గతంలో ఉన్నంత వ్యతిరేకత చూపించడం లేదు. విలీనానికి తాను అధ్యక్షుడిని అయితే అడ్డంకి కాబోనని సంకేతాలు ఇచ్చారు. అలాగే పొత్తుల వ్యవహారం ఉన్నా.. తాను ఎలాంటి ఆటంకాలు కల్పించబోనని వ్యతిరేకించబోనని సంకేతాలు ఇస్తున్నారు.
ఇతర నేతలు ఈ లౌక్యం పాటించలేకపోతున్నారు. అయితే ఈటల రాజేందర్ కు ఒక్కటే మైనస్ ఉంటుంది. అదేమిటంటే కొత్తగా పార్టీలోకి రావడం . బీఆర్ఎస్ పార్టీ గెంటేస్తే ఆయన బీజేపీకి రావాల్సి వచ్చింది. పార్టీలో ఆరెస్సెస్ నుంచి ఎదిగిన మురళీధర్ రావుతో పాటు బండి సంజయ్ సహా చాలా మంది నేతలు అవకాశం కోసం చూస్తున్నారు. ఎన్నిక ప్రజాస్వామ్యయుతంగా జరుగుతోంది కానీ పేరు మాత్రం ఢిల్లీ నుంచి రావాల్సిందే. హైకమాండ్ నుంచి ఏ పేరు వస్తుందో వారు మాత్రమే నామినేషన్ వేస్తారు.