తెలంగాణ ప్రభుత్వం రైతులకు స్వీట్ షాక్ ఇచ్చింది. రైతులకు ఈ సీజన్లో రైతు భరోసా నిధుల్ని వెంటనే జమ చేయాలని నిర్ణయించుకుంది. రాజేంద్రనగర్లో జరిగిన రైతునేస్తం వేదిక నుంచి ఆన్ లైన్ లో మీట నొక్కి రైతుల బ్యాంకు ఖాతాల్లో నిధులు జమ చేశారు. 9 రోజుల్లో 9 వేల కోట్లు రైతు భరోసా జమ చేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు.
కోటిన్నర మంది రైతుల ఖాతాల్లో ఎప్పుడైనా నగదు జమ అయ్యే అవకాశాలు ఉన్నాయని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఇంతకు ముందు రైతు భరోసా.. ఎకరాల వారీగా అమలు చేసేవారు. మొదట తక్కువ ఎకరాలు ఉన్నావారికి.. తర్వాత ఎక్కువ ఎకరాలు ఉన్నవారికి అమలు చేసేవారు. ఈ సారి మాత్రం ముందుగానే అందరికీ తొమ్మిది రోజుల్లో జమ చేయాలని నిర్ణయించుకున్నారు. స్థానిక ఎన్నికలకు సిద్ధమవడం ఓ కారణం అయితే.. రుణాలు కూడా సులువుగా లభించడం, నిధులు కూడా అందుబాటులో ఉండటంతో రైతు భరోసా అమలు చేయాలని డిసైడయ్యారు. ఇప్పటికే రైతుల కోసం.. రుణమాఫీ దగ్గర నుంచి ధాన్యం కొనుగోలు వరకూ ఎలాంటి సమస్యలు లేకుండా చేశామని కాంగ్రెస్ పార్టీ నమ్ముతోంది.
స్థానిక ఎన్నికలు ప్రధానంగా గ్రామాల్లోనే ఎక్కువగా జరగనున్నాయి. పంచాయతీతో పాటు పరిషత్ ఎన్నికలు కీలకంగా మారాయి. అత్యదిక చోట్ల కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు గెలవాలంటే.. పథకాలను అమలు చేయాలని డిసైడయ్యారు. నగదు జమ చేసిన వెంటనే స్థానిక ఎన్నికల గురించి ఓ ప్రకటన వచ్చే అవకాశం ఉంది..