ప్రభుత్వ పథకాలు అమలు చేసేది ప్రజల నిధులతోనే. నాయకులు ఎవరూ తమ సొంత డబ్బులను ఇవ్వరు.. ఇవ్వలేరు కూడా. ఒకరిద్దరికి వ్యక్తిగతంగా సాయం చేయగలరు కానీ ప్రభుత్వం తరపున పథకాలు అమలు చేయాలంటే నిధులన్నీ సమకూర్చుకోవాలి. ప్రజల నుంచి వచ్చే డబ్బుతోనే వాటిని అమలు చేయాలి. ఈ విషయంలో గత ప్రభుత్వానికి, ఈ ప్రభుత్వానికి స్పష్టమైన తేడా ఉంది. గత ప్రభుత్వం మద్యం రేట్లు పెంచి, పన్నుల్ని బాది, దొరికిన ఆస్తుల్ని తాకట్టు పెట్టి అరకొరగా పథకాలు అమలు చేసింది. కానీ ఈ ప్రభుత్వం మాత్రం పక్కా ప్రణాళికతో ఉంది.
మద్యం ధరలు తగ్గించినా పథకాల అమలు
గతంలో మద్యం ధరలను షాక్ కొట్టేలా పెంచుతామని చెప్పి.. ప్రాణాలు తీసేలా పెంచిన వైసీపీ ప్రభుత్వం ఆ నిధులతోనే పథకాలు అమలు చేస్తామని జీవోలు ఇచ్చేంత దుస్సాహసానికి ఒడిగట్టింది. మద్యనిషేధం అని చెప్పారు కదా అంటే.. పథకాలు ఆపేయడానికి కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో మద్యం ధరలు తగ్గించారు. వైసీపీ హయాంతో పోలిస్తే సగానికి తగ్గాయి. అయినా సంక్షేమాన్ని రెట్టింపు చేశారు. పెన్షన్ నాలుగు వేలు అందిస్తారు. ప్రతి ఒక్క పిల్లవాడికీ తల్లికి వందనం అమలు చేశారు. అన్న క్యాంటీన్లు నిర్వహిస్తున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే సంక్షేమంలో లోటు రావడం లేదు. అభివృద్ధి పనులు పరుగులు పెడుతున్నాయి.
ప్రజలపై భారం వేయలేదు – ఆస్తులు తాకట్టు పెట్టలేదు !
వైసీపీ ప్రభుత్వంలో ప్రజలపై పన్నుల్ని బాదారు. ఎంత ఘోరం అంటే.. నలభై ఏళ్ల క్రితం ప్రభుత్వాలు ఇచ్చిన ఇళ్లకు బాకీలు ఉన్నాయంటూ వసూలు చేసేందుకు పది మందిని పేదల ఇళ్లపైకి పంపారు. వన్ టైం సెటిల్మెంట్ చేసుకోవాలని ఒత్తిడి తెచ్చారు. మద్యం ధరలను విపరీతంగా పెంచారు. కరెంట్ చార్జీలు ఆరేడు సార్లు పెంచారు. పెట్రోల్ ధరలు దేశంలోనే అత్యధికంగా ఉండేలా చేశారు. ప్రజల్ని అడ్డగోలుగా దోచుకునే అన్ని పన్ను మార్గాలను అనుసరించారు. అంతే కాదు.. దొరికిన ఆస్తులన్నింటినీ తాకట్టు పెట్టారు. విశాఖలో ఉన్న కలెక్టరేట్ భవనాన్ని.. అమరావతిలోని సచివాలయ భవనాన్నీ తాకట్టు పెట్టారు. ఇక మనుషుల్ని కూడా తాకట్టు. పెట్టడమే మిగిలింది అనుకున్న సమయంలో .. పదవి కోల్పోయారు.
గత ప్రభుత్వం చేసిన అప్పులు, బకాయిలు తీరుస్తున్న ప్రభుత్వం
రాష్ట్ర జీడీపీ ప్రకారం ఆర్బీఐ అప్పులు ఇస్తుంది . ఎంత అప్పులు చేయాలో కేంద్రం నిర్ణయిస్తుంది. ఆ ప్రకారం ఆర్బీఐ రుణాలు ఇస్తుంది. ఆ రుణాలు తీసుకోవడం ఏమీ ..అలవి మాలిన అప్పులు కాదు. ఆ అప్పులు..గత ప్రభుత్వం చేసిన అప్పుల కిస్తీలకు .. వడ్డీలకు..మిగిల్చిపోయిన బకాయిలకు సరిపోతుంది. కొత్తగా పథకాలు అమలు చేస్తే అది.. సంపద సృష్టి ద్వారానే జరుగుతుంది. ఈ విషయంలో ఏపీ ప్రభుత్వం.. వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. ప్రజల అంచనాలను అందుకుంటోంది.