తీన్మార్ మల్లన్న రాజకీయం ఎంత గందరగోళంగా ఉంటుందో మరోసారి స్పష్టమయింది. యాదాద్రి భువనగరి జిల్లాలో జరిగిన సభకు తీన్మార్ మల్లన్న హాజరయ్యారు. ప్రోటోకాల్ ప్రకారం ఆయనకు పిలుపు వచ్చి ఉండవచ్చు కానీ.. రేవంత్ రెడ్డిపై ఇష్టం వచ్చినట్లుగా విమర్శలు చేసి.. పార్టీ నుంచి సస్పెండ్ చేసిన తర్వాత కూడా ఆయన ఎందుకు ఆ సభలో పాల్గొన్నారో ఆయనకే తెలియాలి. పాల్గొనడమే కాదు.. ముఖ్యమంత్రి రేవంత్ చుట్టూ తిరుగతూ.. ఆయనతో నవ్వుతూ మాట్లాడుతూ తమ మధ్య మంచి సంబంధాలు ఉన్నాయని ఎక్స్ పోజ్ చేసుకునేందుకు ప్రయత్నించారు.
తీన్మార్ మల్లన్న వ్యవహారశైలి చూసి కాంగ్రెస్ నేతలు కూడా ఆశ్చర్యపోయారు. కాంగ్రెస్ అత్యంత ప్రతిష్టాత్మకంగా కులగణన చేపట్టింది. దాన్ని దేశవ్యాప్తంగా ఓ రోల్ మోడల్ గా ప్రచారం చేసుకుంటోంది. అలాంటి కులగణనను తీన్మార్ మల్లన్న యూరిన్ పోసి తగులబెడతానని ప్రకటించారు. తగలబెట్టారు కూడా. కాంగ్రెస్ పార్టీ ఇమేజ్ డ్యామేజ్ జరిగేలా చాలా పనులు చేశారు. దాంతో ఎమ్మెల్సీ అయినప్పటికీ కాంగ్రెస్ వదిలించుకుంది. సస్పెండ్ చేసింది. సస్పెన్షన్ తర్వాత ప్రెస్ మీట్ పెట్టి రేవంత్ రెడ్డిపై ఇంకా తీవ్రమైన ఆరోపణలు చేశారు.
ఇప్పుడు ఏమయిందో కానీ మళ్లీ అదే రేవంత్ రెడ్డి చుట్టూ తిరుగుతున్నారు. బీసీ పార్టీ పెట్టి సీఎం అయిపోవాలన్నది ఆయన కల. అందుకే .. బీసీ సంఘాలను ఏకతాటిపైకి తెచ్చేందుకు రెడ్లను.. ఇతర అగ్రకులాలను దూషిస్తూ ఉంటారు. నల్లగొండ కాంగ్రెస్ నేతలపై ముఖ్యంగా.. రెడ్డి నేతలపై ఆయన భాష హద్దులు దాటిపోయి ఉంటుంది. తన దారి తాను చూసుకోవాలని డిసైడయిన తర్వాత మళ్లీ ఆయన కాంగ్రెస్ నేతలతో.. ముఖ్యంగా రేవంత్ తో ఎందుకు సన్నిహితం అయ్యేందుకు ప్రయత్నిస్తున్నారో మరి !