స్థానిక ఎన్నికలు రోజుల్లోకి వచ్చేశాయని.. ఇక రెడీ కావాలని సీతక్క, పొంగులేటి వంటి వాళ్లు చేసిన ప్రకటనల్లో పస లేదని తేలిపోయింది. స్థానిక ఎన్నికలపై హైకోర్టులో జరిగిన విచారణలో రాష్ట్ర ఎన్నికల కమిషన్ .. మరో అరవై రోజుల గడువు కోరింది. అంటే మరో రెండు నెలల వరకూ ఎన్నికలు పెట్టే అవకాశం లేదు. రిజర్వేషన్లు ఖరారు చేయడానికే ఇరవై రోజు రోజులు పడుతుందని తెలిపింది. ఈ రిజర్వేషన్ల ఖరారే పెద్ద బ్రహ్మపదార్థం. బీసీ రిజర్వేషన్ల పేరుతో కాంగ్రెస్ పెద్ద రాజకీయమే చేసింది. ఇప్పుడు దాన్ని అధిగమించడం అంత తేలిక కాదు.
హైకోర్టుకు గతంలో ఫిబ్రవరిలోపే నిర్వహిస్తామని చెప్పింది. కానీ నిర్వహించలేకపోయారు. ఎందుకు నిర్వహించలేకపోయారని హైకోర్టు అడిగితే సమాధానం చెప్పలేకపోయారు. ఎప్పుడు నిర్వహిస్తారని అడిగితే మరో రెండు నెలల గడువు కోరారు. దీంతో హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. స్థానిక ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ క్యాడర్ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. పంచాయతీ ఎన్నికలు , పరిషత్ ఎన్నికలు.. ఆ తరవాత మున్సిపల్ ఎన్నికలు జరగాల్సి ఉంది.
ప్రస్తుతం స్థానిక సంస్థలన్నీ ప్రత్యేక అధికారుల పాలనలోనే ఉన్నాయి. పంచాయతీ , పరిషత్ ఎన్నికలు నిర్వహించడానికే రైతు బంధును శరవేగంగా అమలు చేశారని అనుకున్నారు. వారం రోజుల్లో 9వేల కోట్ల రూపాయలను రైతుల ఖాతాల్లో జమ చేశారు. అయినా ఎన్నికలు నిర్వహించే ఉద్దేశంలో లేకపోవడం.. మరో రెండు నెలల గడువు కోరడంతో.. కాంగ్రెస్ పార్టీ క్యాడర్ నిట్టూరుస్తోంది.