రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత రెండు, మూడు ప్రాజెక్టుల గురించి బాగా హైప్ క్రియేట్ చేశారు. అందులో మూసి ప్రక్షాళన, ప్యూచర్ సిటీ కీలకం. ఈ రెండు విషయాల్లోనూ ఏడాదిన్నర గడిచినా కనీస పురోగతి లేదు. ఫ్యూచర్ సిటీ గురించి ఎప్పటికప్పుడు ఏదోక ప్రకటన చేస్తూనే ఉన్నారు. తాజాగా భారత్ ఫ్యూచర్ సిటీ అని పేరు పెడుతున్నట్లుగా ప్రకటించారు.
అయితే ఇప్పటి వరకూ అసలు ఫ్యూచర్ సిటీ మాస్టర్ ప్లాన్ ఏంటో ఎవరికీ తెలియదు. ప్రభుత్వ పెద్దలకూ తెలియదు. మెట్రో కనెక్టివిటీ అనే ప్రచారం ఉంది. కానీ ప్రాథమిక అడుగులు పడలేదు. రోడ్ కనెక్టివిటీ.. ఫ్యూచర్ సిటీలో రోడ్ల నిర్మాణం ప్రారంభం కాలేదు. మౌలిక సదుపాయాల కల్పనపై కూడా స్పష్టత లేదు. ఎలా చూసినా ఫ్యూచర్ సిటీకి అడుగు కూడా ముందుకు పడలేదు.
ఫ్యూచర్ సిటీ పేరుతో రియల్ ఎస్టేట్ మాత్రం జోరుగా నిర్వహించారు. ముచ్చర్ల ప్రాంతంలో భూముల ధరలు పెంచారు. ప్లాట్లుగా చేసి అమ్మేసుకునే ప్రయత్నం చేశారు. ఇప్పుడు ఎక్కడా ప్రకటనలు కూడా కనిపించడం లేదు. ఫ్యూచర్ సిటీ దగ్గర ఫ్యూచర్ కోసం ప్లాట్లు కొనాలని ఎవరూ అడగడం లేదు. వచ్చే ఆరు నెలల్లో మాస్టర్ ప్లాన్ రెడీ చేసి.. మౌలిక సదుపాయాల నిర్మాణం, ప్రైవేటు సంస్థల నిర్మాణాలు ప్రారంభమైతేనే మళ్లీ బూమ్ పెరిగే అవకాశం ఉంది.