తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రభుత్వం రెడీ అవుతున్నట్లుగా కనిపిస్తోంది. ముందుగా పంచాయతీ ఎన్నికలు పూర్తి చేయాలనుకుంటున్నారు. దానికి సంబంధించి ఈ నెలలోనే ఎన్నికల ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఈ మేరకు క్యాడర్ కు సంకేతాలు అందుతున్నాయి. స్థానిక ఎన్నికలను పూర్తి చేయడం రేవంత్ రెడ్డి ముందు ఉన్న బిగ్ టాస్క్, ఇప్పటికే లేనిపోని అంశాలతో లింక్ పెట్టుకోవడంతో ఎప్పటికప్పుడు వాయిదాలు వేయాల్సి వచ్చింది.
రైతు భరోసా అకౌంట్లలో జమ చేసి ఎన్నికలకు !
రైతు భరోసా నిధుల్ని రైతుల అకౌంట్లలో జమ చేయడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. నిధుల సమీకరణ చేసుకుంటోంది. వారం పది రోజుల్లో రైతు భరోసాను ఒకే సారి అకౌంట్లలో జమ చేసి పంచాయతీ ఎన్నికల్ని ప్రకటించే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. పంచాయతీ ఎన్నికలను మొదటిగా నిర్వహించడం వల్ల.. రైతుల అకౌంట్లలో జమ చేస్తే.. సత్ఫలితాలు వస్తాయని భావిస్తున్నారు. మంత్రి సీతక్క ఇప్పటికే ఇలాంటి సంకేతాలు ఇచ్చారు.
పంచాయతీ తర్వాత పరిషత్, మున్సిపల్ ఎన్నికలు
గ్రామ పంచాయతీల సర్పంచ్ పదవీ కాలం 2024 జనవరి 31తో, ఎంపీటీసీ, జడ్పీటీసీ పదవీ కాలం 2024 జూన్లో ముగిసింది. గ్రేటర్ సహా మున్సిపాలిటీల పదవీ కాలం ముగిసింది. ప్రస్తుతం ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతోంది . అన్నింటికీ వరుసగా ఎన్నికలు నిర్వహించాల్సిన ఉంది. పార్లమెంట్ ఎన్నికలు ముగిసిన వెంటనే.. స్థానిక ఎన్నికలను పూర్తి చేయాలనుకున్నారు. కానీ కాంగ్రెస్ హైకమాండ్ అనుమతి ఇవ్వలేదో.. సీఎం రేవంత్ వెనుకడుగువేశారో కానీ.. వాయిదాలు పడుతూ వస్తున్నాయి.
అనేక సమస్యలను నెత్తి మీదకు తెచ్చుకున్న వైనం
స్థానిక ఎన్నికలను రాజకీయ నిర్ణయాలతో సంబంధం లేకుండా నిర్వహించుకోవాల్సింది. కానీ బీసీ రిజర్వేషన్లతో ముడిపెట్టారు. రిజర్వేషన్లు కల్పించడం దాదాపుగా అసాధ్యమని తెలిసినా ఇస్తామని ప్రచారం చేసుకున్నారు. ఇప్పుడు చట్టపరంగా ఇవ్వలేదని స్పష్టమయింది. పార్టీపరంగా ఇద్దామని ఇతర పార్టీలకు చాలెంజ్ చేస్తున్నారు. ఇక పథకాల అమలుపై వ్యతిరేక ప్రచారం ఎక్కువగా జరుగుతోంది. అన్నింటినీ తట్టుకుని ఇప్పుడు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. తమ పట్టు తగ్గలేదని.. జరుగుతున్న ప్రచారం అంతా ఫేక్ అని నిరూపించుకోవాల్సిన అవసరం పడింది.