తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సాక్షుల స్టేట్మెంట్లను రికార్డు చేస్తున్నారు. మావోయిస్టు సానుభూతిపరులు అని చెప్పి ఫోన్ నెంబర్లను ట్యాపింగ్ జాబితాలో చేర్చి మొత్తం పని పూర్తి చేశారు . ఈ జాబితా ఇప్పుడు పోలీసుల వద్ద ఉంది. వారి వద్ద నుంచి పోలీసులు స్టేట్మెంట్లు రికార్డు చేస్తున్నారు. ఈ జాబితాలో కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా ఉన్నారు. ఫోన్ ట్యాపింగ్ గురించి మొదటగా చెప్పింది తానేనని.. ఇంకా కేసీఆర్, కేటీఆర్లకు ఎందుకు నోటీసులు జారీ చేయడం లేదని ఆయన ప్రశ్నిస్తున్నారు.
ట్యాపింగ్ సాక్ష్యాలను ధ్వంసం చేయడంతో ఇక తాము దొరకబోమని ట్యాపింగ్ చేసిన వాళ్లు అనుకున్నారు. కానీ పోలీసులు భిన్నమైన వ్యూహంతో ముందుకెళ్తున్నారు. దీంతో వారి గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్లుగా అవుతోంది. అందుకే ఈ మొత్తం ట్యాపింగ్ వ్యవహారంలో పాత్రధారిగా ఉన్న ప్రభాకర్ రావు.. తన పై అధికారులు చెప్పారని .. అప్పటి డీజీపీని ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు. మహేందర్ రెడ్డి చాలా కాలం తెలంగాణ డీజీపీగా ఉన్నారు. అయితే ఆయనతో పని లేకుండా మిగతా వ్యవహారాలను స్వయంగా చక్కబెట్టేవారని గతంలోనే ప్రచారం ఉంది.
మహేందర్ రెడ్డి పదవిలో ఉన్నప్పుడే.. ప్రభుత్వ పెద్దలతో విబేధించినట్లుగా చెబుతున్నారు. పదవి విరమణకు ముందు ఎక్కువగా సెలవులో ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వతా టీజీపీఎస్సీ చైర్మన్ గా పని చేశారు. ఆయనకు ఆ పోస్టు ఇవ్వడంతో చాలా మంది ఆశ్చర్యపోయారు. బీఆర్ఎస్ నేతలు విమర్శలు చేశారు. అక్కడే మహేందర్ రెడ్డికి, బీఆర్ఎస్ పెద్దలకు గ్యాప్ ఉందని స్పష్టమయింది. ఇప్పుడు అదే డీజీపీ పేరును తెరపైకి తెస్తున్నారు. అప్పటి డీజీపీ ఏం జరిగిందో చెబితే మొత్తానికి సూత్రధారులు ఇరుక్కుంటారు.
ట్యాపింగ్ కోసం బీఆర్ఎస్ పెద్దలు ప్రత్యేకమైన టీమ్ను ఏర్పాటు చేసుకున్నారు. ఆ టీమ్ కు డీజీపీతోనూ పని లేదు. నేరుగా బీఆర్ఎస్ బాస్ కు రిపోర్టు చేసేవారని ఇప్పటి వరకూ పోలీసుల దర్యాప్తులో తేలింది. అంటే సూత్రధారులు కూడా చిక్కినట్లే. త్వరలోనే కేటీఆర్, కేసీఆర్లకు ఈ కేసులోనూ నోటీసులు జారీ చేయాల్సి ఉంది. పోలీసుల దర్యాప్తులో తేలిన అంశాల్లో బయటకు వచ్చినవి చాలా చిన్న విషయాలేనని.. అసలు విషయాలు బయటకు వస్తే.. కేసీఆర్, కేటీఆర్లపై సొంత నేతలపై కూడా అసహ్యం వ్యక్తం చేస్తారన్న కామెంట్లు వినిపిస్తున్నాయి.