ఎంతో మంచి చేసినా మనకు ప్రతిపక్ష హోదా వచ్చింది !. ఈ సారి చంద్రబాబుకు డిపాజిట్లు కూడా రావు ! ఈ పక్కన తంతే.. ఆ పక్కన పడతారు !. ఇలాంటి డైలాగులు తన ఎదురుగా కూర్చున్న ఎంపీటీసీలకు చెప్పి జగన్ రెడ్డి … తనలో కమెడియన్ను పూర్తి స్థాయిలో బయటకు తీశారు. ఓ వైపు కడప గడ్డపై మహానాడు జోరుగా సాగుతుంటే తాను కూడా ఏదో మాట్లాడాలన్నట్లుగా మిగిలిపోయిన ఎంపీటీసీల్ని పిలిపించుకుని స్కిట్స్ ప్రదర్శించారు. కానీ ఆయన మాటలు విన్న వారికి నిజంగానే మైండ్ పోతుంది. అసలు జరుగుతున్న వాటికి.. జగన్ చెప్పేదానికి పొంతన ఎక్కడుందని వారే అమోమయ పడతారు.
ప్రతిపక్ష నేత హోదా వచ్చిందని చెప్పుకోవడం ఏంటి?
ఎంతో మంచి చేస్తే మనకు ప్రతిపక్ష నేత హోదా వచ్చిందని చంద్రబాబుకు అది కూడా రాదని జగన్ చెప్పుకొచ్చారు. చంద్రబాబుకు వస్తుందో రాదో తర్వాత సంగతి కానీ తనకు ప్రతిపక్ష నేత హోదా వచ్చిందని ఎలా చెప్పుకుంటున్నారో క్యాడర్ కు అర్థం కావడం లేదు. ఆయన అసెంబ్లీకి వెళ్లడం లేదు. హోదా కోసం హైకోర్టుకు వెళ్లారు. స్పీకర్ నిర్ణయమే ఫైనల్. అయినా తనకు ప్రతిపక్ష నేత హోదా వచ్చిందని చెప్పుకుంటున్నారు. తాను ప్రతిపక్ష నేతనేనని 39శాతం ఓట్లు వచ్చాయని ఆయన చెప్పుకుంటే ఓ రకంగా ఉంటుంది. గుర్తింపు వచ్చేసిందన్నట్లుగా మాట్లాడటంతోనే ఆయన మానసిక స్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
బటన్ నొక్కడం నచ్చకే బటన్ నొక్కారని ఎప్పుడు అర్థం చేసుకుంటారు ?
మాట్లాడితే జగన్ రెడ్డి ఇప్పటికి తాను బటన్ నొక్కానని చెప్పుకుంటున్నారు. ఆ బటన్ల వల్ల ప్రజలకు ఉపయోగం జరిగి ఉంటే.. పాతాళంలోకి తోసేసి మట్టి ఎందుకు కప్పేస్తారు. ఆస్తులు తాకట్టు పెట్టి వంద రూపాయలు తెచ్చి సగం నొక్కేసి.. సగం జనం ఖాతాల్లో వేసి అదే పెద్ద పని అంటూ ప్రచారం చేసుకున్నారు కాబట్టే గెంటేశారు. అలాంటి బటన్ల అవసరం ప్రజలకు లేదు. ఆ విషయం ఎన్నికల ఫలితాలతోనే తేలిపోయింది. జగన్ రెడ్డి తన సొమ్మేదో ఇస్తున్నట్లుగా ఇచ్చినట్లుగా .. ఘోర పరాజయం తర్వాత కూడా మాట్లాడటం హాస్యస్పదంగా మారింది. పార్టీ క్యాడర్ కూడా జీర్ణించుకోలేకపోతున్నారు.
ఈ రాసుకోవడాలు ఏంటో?
పదేళ్ల పాటు తన కోసం పని చేసిన నేతల్ని, కార్యకర్తల్ని ఘోరంగా ముంచేసిన చరిత్ర జగన్ ది. ఆయనకు ఇప్పుడు నిఖార్సైన కార్యకర్తలు ఎవరూ లేరు. చివరికి కార్యకర్తలుగా వాలంటీర్లను నియమించుకుని ఇప్పుడు వారి గురించి కనీసం పట్టించుకోవడంలేదు. క్యాడర్ అయితే మరోసారి కష్టపడండి నేను సీఎం కాగానే జగనన్న 2.0 షాకులు ఎలా ఉంటాయో చూపిస్తానని భయపెడుతున్నారు. ఎవరైనా ఏదైనా అంటే.. మీ బుక్కుల్లో రాసుకోండి.. మనం వచ్చిన తర్వాత సంగతి తేల్చేద్దాం అంటున్నారు. కనీసం నేను రాసుకుంటానని జగన్ రెడ్డి కూడా అనడం లేదు.
ప్రభుత్వంపై పోరాటాల్లేవు. వైసీపీ నేతలు విచ్చలవిడిగా చేసిన అవినీతితో అడ్డంగా దొరికిపోతే ప్రజల నుంచి సానుభూతి రావడం లేదు. జగన్ పై వ్యతిరేకత ఇంచ్ కూడా తగ్గినట్లుగా సంకేతాలు లేవు. అయినా ఊహాలోకంలో తిరుగుతూ.. జబర్దస్త్ డైలాగులతో నవ్విస్తూ టైం పాస్ చేస్తున్నారు. పార్టీ క్యాడర్ ను మోసం చేస్తున్నారు.