తెలుగు సినీ పరిశ్రమ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ అయ్యేందుకు సమయం ఖరారు అయింది. ఈ నెల 15వ తేదీన సినీ పెద్దలంతా అమరావతి రానున్నారు. సినీ పరిశ్రమ అభివృద్ధి కోసం చంద్రబాబుతో సమావేశం కానున్నారు. టాలీవుడ్ బృందానికి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నాయకత్వం వహించే అవకాశం ఉంది. ఉండవల్లిని చంద్రబాబు నివాసంలోనే సమావేశం జరిగే అవకాశాలు ఉన్నాయి.
ఇటీవల ధియేటర్ల బంద్ విషయంలో కొంత మంది పవన్ కల్యాణ్ సినిమాపై కుట్ర చేయడంతో పవన్ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ పెద్దలను మర్యాదపూర్వకంగా కూడా కలవకుండా.. పైగా కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. గత ప్రభుత్వం వేధించుకుతిన్నదని అయినా.. తాము సానుకూలంగా స్పందించి అన్ని విధాలా సహకారం అందిస్తే ఇలా చేస్తారా అన్న ప్రశ్నలు వచ్చాయి.
చంద్రబాబును కలిసేందుకు ఎంత మంది ప్రముఖులు వస్తారన్నది ఇప్పుడు కీలకం . ఇండస్ట్రీలో కొంత మంది వైసీపీ పెద్దలకు సన్నిహితులు ఉన్నారు. వారు గతంలో ప్రభుత్వ పెద్దల్ని కలవకుండా.. ఇతరులని ఆపేశారన్న ప్రచారం ఉంది. అల్లు అరవింద్ కూడా ఈ విషయం చెప్పారు. కలుద్దామంటే.. మనది ప్రైవేటు వ్యాపారం కాబట్టి కలవాల్సిన అవసరం లేదని చెప్పారని చెప్పుకొచ్చారు. ఆయనెవరో ఇండస్ట్రీకి తెలుసు. అందుకే .. ఈ విషయంలో అయినా ఇండస్ట్రీ ఐక్యంగా ఉంటుందా లేదా అన్నది తేలాల్సి ఉంది.