రామ్ చరణ్ – త్రివిక్రమ్ కాంబోలో ఓ సినిమా ఉంటుందన్న వార్త ఈమధ్య గుప్పుమంది. పెద్ది అయ్యాక సుకుమార్ తో చరణ్ సినిమా చేయాలి. ఆ తరవాత త్రివిక్రమ్ ప్రాజెక్ట్ ఉంటుందన్నారు. ఒకవేళ సుకుమార్ సినిమా ఆలస్యమైతే, ఆ గ్యాప్లో త్రివిక్రమ్ సినిమా పట్టాలెక్కించేసినా ఆశ్చర్యం లేదన్నారు. తీరా చూస్తే ఈ కాంబో లేదని అధికారికంగా ఓ ప్రకటన వచ్చేసింది. ”వెంకటేష్, ఎన్టీఆర్లతో త్రివిక్రమ్ ఓ సినిమా చేస్తున్నారు. అది తప్ప వేరే హీరోలతో సినిమాలు చేస్తున్నారన్న వార్తలేవీ నిజం కాదు” అంటూ త్రివిక్రమ్ సన్నిహితుడు, నిర్మాత నాగవంశీ ఓ కీలక ప్రకటన చేశారు. మొన్నటి వరకూ ‘ఇదిగో. అదిగో..’ అన్న కాంబో సడన్ గా ఎందుకు ఆగిపోయింది? దానికి కారణం ఏమిటి?
త్రివిక్రమ్, రామ్ చరణ్ కాంబో అనుకోవడం వాస్తవం. ఇద్దరూ కలిసి కథ గురించి కూడా చర్చించుకొన్నారు. కానీ అసలు సమస్య.. ఈ సినిమాని ఏ బ్యానర్లో చేయాలి? అనేదానిపైనే అని టాక్. చరణ్ మనసులో ఓ నిర్మాత (పవన్ కల్యాణ్ కాదు) ఉన్నారు. ఆయనకే సినిమా చేసి పెట్టాలని చరణ్ ఫిక్సయ్యారు. కానీ త్రివిక్రమ్ మాత్రం హారిక హాసినిలో చేయాలని పట్టుపట్టారని తెలుస్తోంది. అందుకే చరణ్ ఈ సినిమా చేయడానికి ఒప్పుకోలేదని టాక్. అందుకే ఈ కాంబో ఆగిపోయిందని తెలుస్తోంది. రెండు సంస్థలూ కలిసి ఈ సినిమా చేసే అవకాశం ఉన్నా అందుకు చరణ్, త్రివిక్రమ్ ఒప్పుకోలేదని తెలుస్తోంది. అందుకే ఈ సినిమా చర్చల దశలోనే ఆగిపోయింది. సుకుమార్ తో సినిమా పూర్తయ్యాక.. ఆ నిర్మాత కోసం చరణ్ ఓ సినిమా చేస్తారు. కానీ దర్శకుడెవరన్నది తేలాలి.