తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై కాలయాపనకు హైకమాండ్ ఎట్టకేలకు శుభం కార్డు వేయబోతోంది. ప్రస్తుతం మూడు మంత్రి పదవులను భర్తీ చేయబోతోంది. ఇందుకు ఆదివారమే ముహూర్తంగా ఫిక్స్ చేసింది. తెలంగాణ గవర్నర్ ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నారు. ఆయన శనివారం రాత్రి హైదరాబాద్ చేరుకుంటారు. రేపు మధ్యాహ్నం కొత్త మంత్రులతో రాజ్ భవన్ లో గవర్నర్ ప్రమాణస్వీకారం చేయించనున్నారు.
అయితే, శనివారం మధ్యాహ్నం వరకు ఆదివారం ముగ్గురు కొత్త మంత్రులు ప్రమాణస్వీకారం చేస్తారని హైకమాండ్ లీకులు ఇచ్చింది. సాయంత్రానికి అనూహ్యంగా కేబినెట్ నుంచి ఇద్దరు మంత్రులను తప్పించే అవకాశం ఉన్నట్టు కాంగ్రెస్ వర్గాల్లో ప్రచారం కావడం ఇంట్రెస్టింగ్ గా మారింది. వారి పేర్లు బయటకు రాలేదు కానీ, ఎవరిని తప్పిస్తారనేది రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ రేపుతోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో హైకమాండ్ మంత్రులను తప్పించే సాహసం చేస్తుందా ? అన్నది బిగ్ డిబేట్ గా మారింది. స్థానిక సంస్థల ఎన్నికలకు సర్కార్ కసరత్తు చేస్తున్న టైంలో మంత్రులను తప్పించి కొత్త తలనొప్పులు పెట్టుకుంటుందా? అని గాంధీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
ప్రస్తుతం సామాజిక సమీకరణాల ఆధారంగా బీసీ, ఎస్సీ, ఎస్టీలకు మంత్రివర్గంలో చోటు కల్పించేలా కేబినెట్ విస్తరణకు హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వాకిటి శ్రీహారి పేరు ఖరారు కాగా, ఎస్సీ మాల సామాజిక వర్గం నుంచి వివేక్, మాదిగా సామాజిక వర్గం నుంచి కవ్వంపల్లి సత్యనారాయణ పేరు బలంగా వినిపిస్తోంది. అలాగే, ఎస్టీ సామాజిక వర్గం నుంచి బాలు నాయక్ – శంకర్ నాయక్ పేర్లు పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తోంది. అదే సమయంలో నిజామాబాద్ జిల్లా నుంచి సుదర్శన్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలని రేవంత్ పట్టుబడుతున్నారు.
మొత్తంగా కేబినెట్ విస్తరణలో పాత వారిలో ఎవరికైనా ఉద్వాసన పలుకుతారా లేదంటే ఖాళీగా ఉన్న స్థానాలనే భర్తీ చేస్తారా అన్నది ఉత్కంఠగా మారింది.