తెలంగాణాలో తెదేపా నేతలు, ఎమ్మెల్యేలు తెరాసలోకి వెళ్లిపోతుంటే, ఆంధ్రాలో కాంగ్రెస్, వైకాపాల నుండి తెదేపాలోకి వస్తున్నారు. అందుకు వారు చెప్పే కారణం ప్రజాభిప్రాయానికి అనుగుణంగా నడుచుకోవడం లేదా సదరు ముఖ్యమంత్రులు రాష్ట్రాభివృద్ధి కోసం చేస్తున్న కృషిలో బాగస్వాములు అవడం లేదా రేవంత్ రెడ్డి చెప్పిన వేరే ఇతర కారణాలు కావచ్చును. కానీ అసలు కారణం మాత్రం ఆ రెండు పార్టీలు అధికారంలో ఉండటమే. నీరు పల్లమెరుగు అన్నట్లు లేదా బెల్లం చుట్టూ ఈగలు ముసురుతున్నట్లు అధికారం ఉన్న చోటికే రాజకీయ నేతలందరూ చేరుకొంటుంటారు. కానీ ఏనుగుకి పైకి కనబడే దంతాలు. నోట్లో తినే దంతాలు వేరేగా ఉన్నట్లే రాజకీయ నాయకులు కూడా పార్టీలు మారడానికి ఏవేవో ‘ఇష్టోరీలు’ చెపుతుంటారు.
ఇక విషయంలోకి వస్తే ప్రకాశం జిల్లాకి చెందిన ఇద్దరు వైకాపా ఎమ్మెల్యేలు గోడ దూకేయడానికి సిద్దంగా ఉన్నాట్లు తాజా సమాచార, వారిలో ఒకరు అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ కాగా మరొకరు కందుకూరు ఎమ్మెల్యే పి.రామారావు. ఇద్దరూ తెదేపాలో చేరడానికి సంసిద్దత వ్యక్తం చేయగా చంద్రబాబు నాయుడు కూడా ఒకే చెప్పేసినట్లు పార్టీ వర్గాలు చెపుతున్నాయి. కానీ స్థానిక తెదేపా నేతల నుండి అభ్యంతరాలు వస్తునందున ఆలస్యం అవుతున్నట్లు తెలుస్తోంది. అద్దంకిలో కరణం బలరామ్, కందుకూరులో దివి శివరామ్ నుండి అభ్యంతరాలు చెపుతున్నారు. ఇంకా కడపలో వైకాపా ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కూడా సిద్దంగా ఉన్నప్పటికీ ఆయనకీ అదే సమస్య ఎదురవడంతో గత రెండు నెలల నుండి లైన్ క్లియర్ సిగ్నల్ కోసం ఎదురు చూస్తున్నారు.
అయితే వైకాపాను దొంగల పార్టీ అని, దాని అధినేత జగన్మోహన్ రెడ్డి ని ఆ దొంగల ముఠాకి నాయకుడని తెదేపా నేతలు తరచూ విమర్శిస్తున్నప్పుడు మళ్ళీ ఆ దొంగల ముఠా నుండే ఎమ్మెల్యేలను పార్టీలో ఎందుకు చేర్చుకొంటున్నట్లో…వైకాపాలో ఉన్నప్పుడు నేరస్తులుగా కనిపించిన వారందరూ తెదేపాలో చేరిపోగానే నిష్కళంకమైన నేతలుగా మారిపోతారనుకోవాలేమో?